
ప్రజాస్వామ్యం ఖూనీ
ఎమ్మెల్సీ టి. కల్పలతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి లైవ్ డిబేట్లో కృష్ణంరాజు మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టంగా యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు మహిళా లోకానికి స్పష్టమైన క్షమాపణలు చెప్పారన్నారు. అయినా కక్ష సాధింపు ధోరణితో ఆయనపై ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టడం సిగ్గుచేటని ఖండించారు. వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు పెట్టడంలో తప్పు లేదని, డిబేట్ నిర్వహించిన కొమ్మినేనిపై, సాక్షి యాజమాన్యంపై కేసు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం సబబు కాదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కేవలం కూటమి ప్రభుత్వం పొలిటికల్ డైవర్షన్లో భాగంగానే రాష్ట్రంలో అక్రమ కేసులకు తెరదీస్తున్నారని, ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో తన్మయి అనే విద్యార్థినిని హత్య చేశారని, ఓ బాలికను ఆరు నెలల పాటు 14 మంది అతి దారుణంగా రేప్ చేశారని, వీటిపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. కామాంధులను వదిలేసి కక్షసాధింపు చర్యలు ఏంటని ప్రశ్నించారు. ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ఇష్టానుసారంగా చానెల్లో జరిగిన అంశాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతమ్మలపై అంటగట్టే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
దాడులు సిగ్గుచేటు
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించబోమని, యాంకర్గా పనిచేసిన కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసులు పెట్టడం సబబు కాదని తెలిపారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేయటం సిగ్గుచేటన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారమే సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.ఏపీలో క్రైమ్లు, అక్రమ కేసులు, దాడులు పెట్టడంలో మొదటి ప్లేస్కు రావటం తథ్యమని పేర్కొన్నారు.
సాక్షిపై అక్కసు దుర్మార్గం
మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ మాట్లాడుతూ సాక్షిపై అక్కసు వెళ్లగక్కుతూ.. కూటమి ప్రభుత్వం దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బుద్ధి చెప్పటం తథ్యమని హెచ్చరించారు.
పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. అందుకు అనుగుణంగా కేసులు నమోదు చేయాలని గానీ, ఎస్సీఎస్టీ అట్రాసీటీ చట్టాన్ని ఎందుకు వినియోగించారని ప్రశ్నించారు. కేసు నమోదులో పోలీసులు పచ్చపాతాన్ని చూపించారని, స్వామి భక్తిని చాటుకున్నారని ఆరోపించారు.