
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం
తాడేపల్లి రూరల్: యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని ఎకో పార్క్ ఆవరణలో మంగళవారం యోగాంధ్ర– 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలసి కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పాల్గొన్నారు. యోగా ట్రైనర్లు హాజరైన వారితో యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర– 2025 క్యాంపెన్ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డీఎఫ్ఓ (టెరిటోరియల్) హిమ శైలజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాషా, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా
నిర్వహించాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో షేక్ ఖాజావలితో కలిసి అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె పాల్గొన్నారు. యోగా కార్యక్రమాల్లో ప్రజలను పెద్దఎత్తున భాగస్వామ్యులను చేసి యోగా ప్రాముఖ్యతను వివరించాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో యోగా రిజిస్ట్రేషన్లను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని చెప్పారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు 14న నిర్వహించనున్న యోగాసనాల కార్యక్రమాలకు ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రదేశాలతో పాటు, మాస్టర్ ట్రైనర్స్ మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆజ్ఞాపించారు.
జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి యోగాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి