
మళ్లీ కరోనా కలవరం
జిల్లాలో ఇప్పటివరకు మూడు కేసులు నమోదు
కరోనా పేరు చెబితేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. మళ్లీ ఇటీవల దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కూడా మూడు కరోనా కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నూతనంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్, తదితర ప్రదేశాల్లోకి వెళ్లకుండా దూరంగా ఉండండి. ఏదైనా అనుమానం ఉంటే గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ
గుంటూరు మెడికల్ కరోనా వ్యాప్తి చెందకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొవిడ్–19 నాటి నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశాల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నూతన కరోనా వైరస్ సైతం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
తెనాలిలో ఫీవర్ సర్వే
జిల్లాలో తెనాలికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తెనాలిలో ఫీవర్ సర్వే చేయిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఏలూరుకు చెందిన మరో ఇరువురు సైతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
లక్షణాలు ఇవీ...
చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. తుమ్ములు, దగ్గుతో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు, ఆయాసం, ఛాతీ పట్టివేయడం వంటివి కరోనా వ్యాధి బాధితుల్లో కనిపిస్తున్నాయి.
వారం దాటితే వైద్యులను
సంప్రదించాలి
నార్మల్ ఫ్లూ మాదిరిగానే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారానికి మించి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పల్మనాలజిస్టులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పదేళ్లలోపు పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తమా, డయాలసిస్, షుగర్, బీపీ, కిడ్నీ, గుండె జబ్బు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మాస్క్లు ధరించడం, తగినంత నీటిని తీసుకోవడం ఉత్తమం.
– డాక్టర్ బి.దుర్గాప్రసాద్,
పల్మనాలజిస్ట్, గుంటూరు
అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు ఆదేశాలు ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల సూచన వ్యాధి బాధితులకు గుంటూరు జీజీహెచ్లో నిర్ధారణ పరీక్షలు
జాగ్రత్తలు
తీసుకుంటే
మేలు..
దగ్గినా, తుమ్మినా తప్పనిసరిగా ముఖానికి చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు.
చేతులను తరచుగా సబ్బుతో, శానిటైజర్తో మంచిగా శుభ్రం చేసుకోవాలి.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి.
సరిపడా నీరు తాగాలి. కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల వరకు నిత్యం తాగడం మంచిది.
తగినంత నిద్రించాలి.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.
వైద్యుల సలహాలు లేకుండా సొంతంగా ఔషధాలు వేసుకోవద్దు.

మళ్లీ కరోనా కలవరం

మళ్లీ కరోనా కలవరం

మళ్లీ కరోనా కలవరం