చిలకలూరిపేట: నల్లబర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ చిలకలూరిపేటలోని ఐటీసీ కంపెనీ వద్ద పొగాకు రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. క్వింటా ధర రూ.15వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకును కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలని కోరారు. దీక్షకు రైతులు, రైతు సంఘాల నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
నేడు కోటప్పకొండలో యోగాంధ్ర
నరసరావుపేట: కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద యోగాంధ్ర కార్యక్రమం బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు.
విజయకీలాద్రిపై సుదర్శన హోమం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.
గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : బక్రీదు పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ కె.సీతారామిరెడ్డి హెచ్చరించారు. జూన్ 7న జరిగే బక్రీదు పండుగ సందర్భంగా గేదెలు, ఇతర పశువులను అధిక సంఖ్యలో వాహనాల్లో తరలించి వధకు పాల్పడితే వారిపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడంతోపాటు, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో పశువులను తరలించే వారు ఎంవీఐ యాక్ట్ 1989, రూల్ 253 ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అనంతరం తరలించాలని సూచించారు.
శని జయంతి పూజలు
మంగళగిరి టౌన్: శ్రీశనైశ్చర స్వామి జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో మంగళవారం శనిజయంతి పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి తైలాభిషేకం, అర్చనలు, జపాలు, పూజలు నిర్వహించి పురోహితులకు నువ్వులు దానాలు ఇచ్చారు. దేవస్థానంలోని మల్లేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ తగు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.
ఎంపీహెచ్ఏలకు బదిలీ
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ కేడర్కు చెందిన 172 మందికి డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి మలేరియా, డెంగీ, చికున్ గున్యా ప్రబలి ఉన్న పలు ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో డీఎంహెచ్ఓతోపాటు, పరిపాలన అధికారి లక్ష్మీకుమారి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, భక్తవత్సలం, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్, రహీం పాల్గొన్నారు.