
ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏపీఆర్జేసీ సెట్–2025లో అర్హత సాధించిన విద్యార్థులకు సంస్థ కార్యదర్శి బీఎన్ మస్తానయ్య ఆదేశాల మేరకు ఆంధ్ర రీజియన్లోని ఏపీఆర్ జూనియర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను ఏపీఆర్జేసీ సెట్ కన్వీనర్ హెచ్ఎండీ ఉబేదుల్లా పర్యవేక్షించారు. ఆంధ్ర రీజియన్ పరిధిలోని తాటిపూడి బాలికల కళాశాల, నిమ్మకూరులోని కో–ఎడ్యుకేషన్, నాగార్జునసాగర్లోని బాలుర కళాశాల, గుంటూరు, వెంకటగిరిలోని బాలుర జూనియర్ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 299 సీట్లకు 1:5 నిష్పత్తిలో 1,328 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలువగా, వారిలో మొదటి రోజు ఎంపీసీ, ఐఐటీ కోర్సులకు 131 బాలురు, 33 మంది బాలికలు హాజరై ఆయా కళాశాలల్లో సీట్లను కోరుకున్నారు. కాగా మంగళవారం బైపీసీ, బుధవారం ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఉబేదుల్లా తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు భోజన, తాగునీటి వసతులు కల్పించారు.
తుళ్లూరులో 28.8 మి.మీ వర్షం
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా తుళ్లూరు మండలంలో 28.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తాడేపల్లిలో 0.6 మి.మీ వర్షం పడింది. సగటున 3.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఫిరంగిపురం మండలంలో 17.4 మి.మీ., తాడికొండ 8.2, ప్రత్తిపాడు 5.8, గుంటూరు తూర్పు 1.2, గుంటూరు పశ్చిమలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది.