
వంతెన పనులు వేగవంతం చేయాలి
లక్ష్మీపురం: శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ చాంబర్లో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్తో కలిసి వంతెన పనులపై వివిధ శాఖలు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో ఎ.భార్గవ్ తేజ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పనులకు సంబంధించి పిల్లర్ల నిర్మాణం రెండు వారాల్లో ప్రారంభించేలా నిర్మాణ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుకు సాగాలని సూచించారు. నిర్మాణ ఏజెన్సీకి హిందూ కళాశాల వైపు, లాడ్జి సెంటర్ వైపు ఫ్రీ కాస్ట్ మెటీరియల్ సిద్ధం చేసుకోవడానికి గుర్తించిన స్థలాలను మరోసారి పరిశీలించి మంగళవారం నాటికి వివరాలు తెలపాలని పేర్కొన్నారు. ఆర్ఓబీ నిర్మాణ ప్రాంతంలోని విద్యుత్ స్తంభాల తరలింపునకు విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి మున్సిపల్ శాఖకు అంచనాలు అందించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని ఓఎస్డీ రూప్కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ బాబు, నగరపాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఈఈ సమర్పణ రావు, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు , రైల్వే డీఈ భరత్, బీఎస్ఎన్ఎల్ డీఈలు రఘురాం, నాగరాజు, ట్రాఫిక్ సీఐలు అశోక్ కుమార్, సింగయ్య, నిర్మాణ ఏజెన్సీ లక్ష్మణ్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి’పై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంబంధిత శాఖలు సమన్వయంతో సాగాలని ఆదేశం