
పాఠశాల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయడం లేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు విమర్శించారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలతో ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మనుగడ కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 117ను మంత్రి నారా లోకేష్ రద్దు చేస్తానని చెప్పినా, దానిని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేసి మరింత గందరగోళం సృష్టిస్తుందని చెప్పారు. కేవలం 1, 2 తరగతులతో ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ధర్నాకు అధ్యక్షత వహించిన కె.బసవలింగారావు మాట్లాడుతూ బదిలీల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర, తెలుగు స్కూల్ అసిస్టెంట్స్ తప్పనిసరి చేస్తూ వారి స్థానంలో మరొక స్కూల్ అసిస్టెంట్ను తీసుకురావాలనుకోవడం అధికారుల నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులివ్వాలని కోరారు. అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు కోర్ట్ కేసులతో సంబంధం లేకుండా కోరుకున్న చోట ఉండేట్లు చూడాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీదా, ఎం.ఎన్ మూర్తి, ఎం. హనుమంతవవు, నాగశిన్నారాయణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి
పాండురంగ వరప్రసాదరావు