
బైక్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
పట్నంబజారు: బైక్ల చోరీల కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, లాలాపేట పీఎస్ ఎస్హెచ్ఓ శివప్రసాద్ వివరాలు వెల్లడించారు. గుంటూరు నగరం ఇజ్రాయిల్పేటకు చెందిన షేక్ సుభాని (ప్రస్తుతం చిలకలూరిపేటలో నివాసం), విజయవాడకు చెందిన పఠాన్ ఆవేజ్ఖాన్లు కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. ద్విచక్ర వాహనాల చోరీలు ఇటీవల అధికం కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కింగ్ హోటల్ సమీపంలోని దుకాణం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం విక్రయిస్తున్న సుభాని, ఆవేజ్ ఖాన్లను ఎస్ఐ విజయ్కుమార్ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారు. ఇద్దరూ గత ఏడాది నుంచి మారు తాళాలు తయారు చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. చోరీ చేసిన వాహనాలను ఆటోనగర్ ప్రాంతంలోని ఓ మెగా హాస్పిటల్ వెనుక భాగంలో దాచి ఓఎల్ఎక్స్లో విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడైందన్నారు. పక్కా సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని రూ. 8.50 లక్షల విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై 16 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లు కిరణ్, శంకర్లను అభినందించారు.