
కూటమి ప్రైవేటు దోపిడీ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారుల నుంచి కూటమి నేతలు అనధికార వసూళ్లకు పాల్పడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు. స్ట్రీట్ వెండింగ్ పాలసీకి వ్యతిరేకంగా వీధి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇంత జరగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇచ్చింది ఒకచోట.. వసూలు అంతటా..!
సండ్రీస్ మార్కెట్లో చెత్త ఆస్కారం లేకుండా పండ్లు దిగుమతులు చేసే వారి వద్ద నుంచి మాత్రమే ఆశీలు వసూలు చేసుకునే అవకాశం గత నెలలో కల్పించారు. అయితే ఇదే అదనుగా కూటమి నేతలు నగరం అంతా దొంగ టోకెన్లు ముద్రించి దర్జాగా వీధి వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ.48 చిల్లర లేదంటూ రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
చిరువ్యాపారులపై ప్రతాపం
గుంటూరు నగరానికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు తట్ట బుట్టల్లో తాటి ముంజలు, బొప్పాయిలు, జామకాయలు, ఈత కాయలు, ఇతర పండ్లు అమ్ముకునేందుకు వస్తుంటారు. వీరి వద్ద నిబంధనల మేరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు. కానీ వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మేం అంత ఇచ్చుకోలేమని.. ఏదో దూర ప్రాంతం నుంచి పొట్టకూటి కోసం వస్తున్నామని వేడుకున్నప్పటికీ ప్రతి రోజు డబ్బులు కట్టాల్సిందే.. మేము పాట పాడుకున్నాం. లేకపోతే రేపటి నుంచి వ్యాపారం చేసుకోనివ్వం అంటూ వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. దీంతో చేసేదేమి లేక వారి అడిగినంత ఇచ్చేస్తున్నారు.
రోజుకు రూ.10వేలుపైనే ..
స్ట్రీట్ వెండింగ్ పాలసీపై కొంతమంది వెండర్స్ కోర్టును ఆశ్రయించడంతో గతంలో కమిషనర్గా పనిచేసిన కీర్తి చేకూరి ఈ టెండర్ ప్రక్రియ పాలసీపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేదాకా వీధి వ్యాపారుల వద్ద నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారు. 2023 నుంచి సండ్రీస్ మార్కెట్(నగరం అంతా) ఆశీలు వసూలు చేసే కార్యక్రమం రద్దయింది. కానీ కౌన్సిల్ తీర్మానానికి విరుద్దంగా టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు నగరం అంతా నలుగురు ప్రైవేట్ వ్యక్తులను పురమాయించి వీధి వ్యాపారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా రోజుకు రూ.10వేలుపైగానే, నెలకు రూ.3లక్షలకు పైగా కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది.
స్ట్రీట్ వెండింగ్ పాలసీకి విరుద్ధంగా
వీధి వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు
పండ్లు దిగుమతి చేసేవారి వద్ద మాత్రమే
వసూలు చేసుకునేందుకు హక్కు
అయితే నగరమంతా తిరిగి
ఇష్టానుసారంగా వసూలు
చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు
రోజుకు ఒక్కో వ్యాపారి నుంచి
రూ.50 వసూలు
నెలకు రూ.3లక్షలకు పైగానే కూటమి
నేతల జేబుల్లోకి అక్రమ సంపాదన
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసే హక్కు ఎవరికీ లేదు. వీధి వ్యాపారులు ఎవరికి కూడా రూపాయి కట్టాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకువచ్చి, ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.
– చల్లా ఓబులేసు,
జీఎంసీ అదనపు కమిషనర్

కూటమి ప్రైవేటు దోపిడీ