
నల్లచెరువులో ఎస్పీ పర్యటన
పట్నంబజారు: గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్కుమార్ మంగళవారం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోనీ నల్ల చెరువులో ప్రాంతంలో పర్యటించారు. లాలాపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్ అగ్రహారం, వాకింగ్ ట్రాక్ ప్రాంతం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, బొమ్మల సెంటర్, నల్లచెరువు, సంపత్ నగర్లో ప్రత్యేక బలగాలతో కాలినడకన పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతల అంశంపై స్థానికులను ఆరా తీశారు. నల్ల చెరువులో నివసించే మహిళలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు అన్నివేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, లాలాపేట సీఐ శివప్రసాద్, ఎస్బీ సీఐ ఏ.శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
లక్ష్మీపురం: బర్లీ పొగాకును నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని కౌలు రైతు సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో హరిబాబు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఈ సంవత్సరం 86 వేల ఎకరాలు బర్లీ పొగాకును రైతాంగం అనేక వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేశారన్నారు. గతంలో క్వింటా రూ. 18వేలకు కొనుగోలు చేయగా ఈ సంవత్సరం రూ.4వేలు మాత్రమే ధర పలికిందన్నారు. రైతాంగం అప్పులు చేసి పంట సాగు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి క్వింటా రూ.15 వేలకు కొనుగోలు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖామంత్రి, కంపెనీల అధికారులు వెంటనే స్పందించి పొగాకు కొనుగోలు చేయాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కార్మికులు, రైతాంగం, పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హర్థాళ్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు ఛానల్ పనులు ప్రారంభించాలని, నల్లమడ ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా బొట్ల రామకృష్ణ, నాగమల్లేశ్వరరావులు ఎన్నికయ్యారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ములకా శివ సాంబిరెడ్డి, పి కృష్ణ, అమ్మిరెడ్డి పాల్గొన్నారు.