
ఊరూరా.. నోరూర..!
ఆవకాయ...తెలుగువారి సంప్రదాయ ఊరగాయ పచ్చడి. ఆంధ్రా ఆవకాయ అంటే దేశంలోనే కాదు, విదేశాల్లో స్థిరపడినవారూ లొట్టలేస్తారు. అందులోనూ గుంటూరు కారంతో చేసిన ఆవకాయ పచ్చడి కాంబినేషనే వేరు. ‘ముద్దపప్పు, నెయ్యితో కలిపి ఆవకాయ పచ్చడి అన్నం అరచెయ్యంతా తీసుకుని ముద్ద చేసుకొని నోటిలో పెట్టుకుంటే...నా సామిరంగా ఆ కమ్మదనాన్ని మాటల్లో చెప్పలేం సుమా!’
● పచ్చడి తయారీలో గృహిణులు బిజీ బిజీ ● ఆంధ్రులకు ఆవకాయకు విడదీయలేని బంధం ● గుంటూరు కారంతో ఆ రుచే వేరు
ఇది ఆవకాయ సీజన్
●
తెనాలి: ప్రస్తుత వేసవి సీజనంటే మామిడికాయ విక్రయం నుంచి, పచ్చడి తయారీ వరకు అమ్మకందార్లు, ఇంటి ఇల్లాళ్లు బిజీగా ఉంటారు. ఇళ్లలోనే కాదు, బజారుల్లోనూ మామిడికాయలు, ధరవరలు, ఆవకాయ తయారీ ముచ్చట్లు వినిపిస్తూనే ఉంటాయి. ఆవకాయ పచ్చడి చేయటమంటేనే ఇంట్లో సందడి అన్నమాట. పెద్దవాళ్లు ముందుగా స్నానం చేశాకగాని పచ్చడి తయారీకి పూనుకొనేవారు కాదు. కుటుంబ సభ్యులు ఒకరు ముక్కలు తరిగితే, ఇంకొకరు మెంతిపిండి, ఆవపిండి కలపటం, ముక్కలు కలియదిప్పేందుకూ తలోచేయి వేస్తారు. పచ్చడి పూర్తయ్యాక పింగాణి జాడీలోకి సర్ది, దానికి శుభ్రమైన పొడిబట్టతో వాసిను కట్టేవారు. అలా నిల్వచేసిన పచ్చడి ఏడాదంతా తాజాగా ఉంటుంది. ఇక జాడీలోకి తీశాక బేసినులో మిగిలిన పచ్చడిలో అన్నం కలిపి ముద్దలుగా చేసి పెడుతుంటే పిల్లలతో సహా ఇంటిల్లపాదీ తినేవారు. ఇవన్నీ ఉమ్మడి కుటుంబాల జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. నేటి తీరిక లేని జీవితాల్లో వీటికి ఆస్కారం తక్కువైంది. ఆవకాయ పచ్చడికి రెడీమేడ్ మార్కెట్ పెరిగింది. స్థానిక పచ్చళ్ల తయారీదారులు కిలో రూ.300 వరకు అమ్మకాలు చేస్తున్నారు. వృత్తి జీవితంలో నిత్యం బిజీగా వుండే శ్రీరామా స్కూలు ప్రిన్సిపాల్ ఉమారాణి మాత్రం సొంతంగా పచ్చడి చేసుకుంటేనే తృప్తిగా ఉంటుందని, అందుకే శ్రమ అనుకోకుండా ఏటా ఆవకాయ చేస్తామని చెప్పారు.
కాయ ఒక్కోటి రూ. 50
ఈసారి మామిడి సీజను గత వారం రోజులుగా ముమ్మరమైంది. సాధారణంగా చిన్న రసాలు, జలాలు, తెల్లగులాబి, ఎర్రగులాబి, నాటుకాయ రకాల మామిడికాయలను పచ్చిగా ఉన్నపుడు పచ్చడికి తీసుకుంటారు. కాయ ఒక్కోటి రూ.50 పలుకుతోంది. తెల్లగులాబీ రకానికి డిమాండ్ ఉంటుంది. వినియోగదారులు కాయ నాణ్యత, పులుపును పరిశీలించి పచ్చడికి ఎంచుకుంటారు. మార్కెట్ దగ్గరే కాయలు కడిగించుకుని, ముక్కలు కోయించుకుని తీసుకెళుతున్నారు. కొందరు డ్వాక్రా గ్రూపు సభ్యులు పచ్చళ్ల వ్యాపారంలో ఉన్నారు. స్థానికులే కాదు, హైదరాబాద్, సింగపూర్, అమెరికాలో ఉండే బంధువులు, తెలిసినవారు వారు చేసిన ఆవకాయను తీసుకెళుతుంటారు. ఇన్ని రకాలుగా ఆవకాయ పచ్చడి రుచిని ఆంధ్రులు ఆస్వాదిస్తూనే ఉన్నారు.
కోరిన సైజులో ముక్కలు..
రోజులు మారినా, వీలు కుదరకున్నా ఏదోలా ఆవకాయను సొంతంగా తయారు చేసుకోవాలని అనుకునే ఇల్లాళ్లూ లేకపోలేదు. వీరికోసమే అన్నట్టుగా ఇప్పుడు పచ్చడి మామిడి కోసేవారు ఎక్కడికక్కడ వచ్చేశారు. ప్రత్యేకమైన కత్తిపీటలతో కోరిన సైజులో ముక్కలను కొట్టి ఇస్తున్నారు. మామిడికాయల అమ్మకాలున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా చిన్న చిన్న స్టాల్స్ నడుపుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రస్తుత వేసవికి దాదాపు వెయ్యి మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. సైజును బట్టి ఒక్కో కాయకు రూ.3 నుంచి రూ.5 వరకు తీసుకుంటున్నారు. రోజుకు 300–500 కాయలు కోస్తామని ఈ వ్యాపారంలో ఉన్న వెంకటేశ్వరరావు చెప్పారు.

ఊరూరా.. నోరూర..!

ఊరూరా.. నోరూర..!

ఊరూరా.. నోరూర..!

ఊరూరా.. నోరూర..!