
జిల్లాలో ప్రాధాన్య రంగాలకు ప్రత్యేక స్థానం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రాధాన్య రంగాలైన వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సర్వీసు రంగాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడో కలెక్టర్ల సమావేశంలో బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ హార్టికల్చర్, పశువులు, అడవులు, ఫిషింగ్, ఆక్వా, ఇండస్ట్రీస్, మైనింగ్, మ్యానుఫ్యాచరింగ్, తదితర 19 ప్రముఖ రంగాల్లో గ్రోత్ రేటు పెంచేందుకు లక్ష్యాలను తయారు చేశామన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీడీవీఏ వృద్ధిరేటు 14.9 శాతం, ఇండస్ట్రీస్ రంగానికి 21.29, సర్వీసు రంగంలో 16.01 ప్రగతి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఉద్యాన పంటలు, పశు సంవర్ధక శాఖలు ప్రధానమని పేర్కొన్నారు. గుంటూరులో మిర్చి సాగు విస్తారంగా చేస్తారని, ప్రస్తుతం జిల్లాలో శీతల గిడ్డంగుల గోదాముల్లో 40 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉంచారన్నారు. ఎగుమతి మార్కెట్ ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోవడంతో మంచి ధర కోసం రైతులు గోదాముల్లో నిల్వ ఉంచారని తెలిపారు. వ్యవసాయ రంగంలో రబీలో పంటల సాగు పెరిగిందన్నారు. కౌలు రైతుల పంటల రుణాలకు రూ. 58 కోట్లు నుంచి రూ. 100 కోట్లకు పెంచేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉద్యాన పంటల్లో గ్రోత్ ఇంజిన్ పంటలైన మిరప, పసుపు, కూరగాయలు, పూల సాగును 17800 హెక్టార్ల నుంచి 18,400 హెక్టార్లకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్ పంటల సాగును 12,100 హెక్టార్లను 14,500 హెక్టార్లకు పెంచుతామన్నారు. జిల్లాకు సంబంధించి అన్ని రంగాల్లో నిర్ధేశించనున్న లక్ష్యాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.