కొరిటెపాడు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శతాబ్దంపైగా లక్షలాది మంది ఉద్యోగుల సహకారంతో దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆ బ్యాంక్ జోనల్ హెడ్ సయ్యద్ జవహర్ చెప్పారు. ఆదివారం తాలూకా కార్యాలయ ఆవరణలోని పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఏపీ, తెలంగాణ యూనియన్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ ఆవిర్భావ సభ, తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జోనల్ హెడ్ జవహర్ మాట్లాడుతూ ఏ సంస్థ ఐనా ఉద్యోగుల సహాయ సహకారాలు లేకపోతే రాణించలేదని పేర్కొన్నారు. అధ్యక్షత వహించిన అసోసియేషన్ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యాలు, ప్రభుత్వాలు చిన్నచూపు ప్రదర్శించడం బాధాకరమని అన్నారు. విశ్రాంతి జీఎం, విశ్రాంత డీజీఎంలు డి.చిరంజీవి, పుల్లారావు, ఏవీఎస్ కృష్ణమోహన్, కేజే.శ్రీనివాసరావు, ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి వీవీకే.సురేష్ ప్రసంగించారు. సమావేశంలో విశ్రాంత ఏజీఎం కె.శివశంకరరావు, కన్వీనర్ ఎంకేవీ.ప్రసాద్, కొండూరి శ్రీనివాసరావు, తెలుగు రాష్ట్రాల విశ్రాంత అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.