సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాలి

Mar 23 2025 9:03 AM | Updated on Mar 23 2025 9:00 AM

కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు

డాక్టర్‌ వేదాంతం రామలింగ శాస్త్రి

గుంటూరు ఎడ్యుకేషన్‌: భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు డాక్టర్‌ వేదాంతం రామలింగశాస్త్రి అన్నారు. శనివారం కలెక్టర్‌ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన భవన్స్‌ కల్చరల్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డాక్టర్‌ రామలింగశాస్త్రి మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక జీవనంలో మన పురాతన కళలైన సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి కనుమరుగవుతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో భారతీయ విద్యా భవన్స్‌ ముందుకు వచ్చి సంస్కృతి, లలిత కళల అకాడమీని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి బాల్యం నుంచే సంగీతం, నాట్యం, సాహిత్యం, గానం, చిత్ర లేఖనంవంటి కళలు నేర్చుకొని అద్భుత ప్రతిభావంతులుగా రాణించాలన్నారు. ప్రముఖ గజల్‌ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ లలిత కళలు మన భారత జీవన గమనంలో భాగమని, పాశ్చాత్య దేశాలు పుట్టక మునుపే మన దేశంలో నలంద, తక్షశిలా వంటి విశ్వవిద్యాలయాల్లో సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి అనేక కళల్లో శిక్షణా తరగతులను నిర్వహించి, భావితరాలకు అద్భుత కళారూపాలను అందించారని తెలిపారు. భారతీయ విద్యా భవన్స్‌ కార్యదర్శి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ అనేకమంది ప్రఖ్యాత కళాకారులకు జన్మభూమి అయిన గుంటూరులో అకాడమీను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వేదాంతం రామలింగేశ్వర శాస్త్రి చేతులమీదుగా అకాడమీ లోగోని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ సంగీత నాటక పాఠశాల ప్రిన్సిపాల్‌ మార్టూరు హరిబాబు, శ్రీసాయి మంజీరా ఆర్ట్‌ అకాడమీ కార్యదర్శి కాజా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి శేషు రాణిని సన్మానించారు. సాహితీ సమాఖ్య కన్వీనర్‌ ఎస్వీఎస్‌ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యా భవన్‌ కోశాధికారి రామ్‌ సుభాష్‌, హిందూ కళాశాల తెలుగు విభాగాధిపతి ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్‌ హేమాంబ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు

ఎమ్మెల్యే ఒత్తిడితోనే అంటున్న కుటుంబ సభ్యులు

పట్నంబజారు: గుంటూరు ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పాతగుంటూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు నమోదయింది. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు సయ్యద్‌ ఇంతియాజ్‌, సయ్యద్‌ ఫిరోజ్‌లు అన్నదమ్ములు. వీరిపై గత ఎనిమిది సంవత్సరాలుగా రౌడీషీట్‌ ఉంది. ఈక్రమంలో గత కొద్దిరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలో జరిగిన ఒక ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన తూర్పు ఎమ్మెల్యే ఎండీ నసీర్‌ అహ్మద్‌కు వీరికి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌పై వీరు దాడికి యత్నించారు. గతంలో నుంచే టీడీపీలో నసీర్‌ అహ్మద్‌, ఇంతియాజ్‌ కుటుంబీకుల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇంతియాజ్‌, ఫిరోజ్‌ల సోదరుడు ముజీబ్‌ కూడా టీడీపీ తూర్పు నియోజకవర్గ సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో వీరిమధ్య వివాదాలు మరింత ముదిరాయి. వివాదం విషయాన్ని మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ ఉద్దేశ్యపూర్వకంగా వీరిపై పీడీ యాక్టు పెట్టించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి అదును కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే వీరికి ఉన్న రౌడీషీట్లను అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో పీడీ యాక్టుతో పావులు కదిపారనే ఆరోపణలు లేకపోలేదు. పీడీ యాక్టు నమోదైన ఇంతియాజ్‌, ఫిరోజ్‌లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లిన నేపధ్యంలో వారు పరారీలో ఉన్నారని తెలిసింది. ఈ నేపధ్యంలో వారు టీడీపీ అగ్ర నాయకత్వాన్ని కలిసి విషయాన్ని వారికి దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లుసమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement