గుంటూరు రూరల్: విద్యార్థులు ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని ఏపీఎస్సీహెచ్ఈ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్) చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి చెప్పారు. పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జాతీయస్థాయి టెక్ ఒడిస్సీ, కల్చరల్ కాస్కేడ్, క్రియేటివ్ కాన్వస్, వర్డ్ సింఫణీ, బిజినెస్ పరేడ్, చిల్ థ్రిల్, స్పోర్ట్స్ ఫెస్ట్ నిరులోత్సవ్–2కే25ను శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు చేశారు. ఐబీఎం ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ టెక్నికల్ టీమ్ లీడర్, విజ్ఞాన్ నిరుల పూర్వ విద్యార్థి నారేడ్ల లావణ్య మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వాళ్లే జీవితంలో నిలబడతారని చెప్పారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, గౌరవ అతిథిగా యాంకర్, యాక్టర్ విజ్ఞాన్ పూర్వ విద్యార్థి ప్రదీప్ మాచిరాజు రానున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. ఫెస్ట్కు సుమారుగా 200 కళాశాలల నుంచి 15 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. అనంతరం 45కుపైగా అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను యాజమాన్య ప్రతినిధులు సన్మానించారు.
విజ్ఞాన్ నిరులోత్సవ్–2కే25 ప్రారంభం