తాడేపల్లిరూరల్: చాలా ప్రమాదంలో ఉన్నామని, గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేస్తున్నారని గుంటూరు ఎస్పీ సతీష్కుమార్ ఎదుట నులకపేట ప్రజలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఎస్పీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేని ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం విలేకరులతో ఎస్పీ మాట్లాడుతుండగా స్థానిక మహిళలు వచ్చి ఆయనకు తమ గోడు విన్నవించుకున్నారు. గంజాయి మత్తులో యువకులు రోడ్లపై ద్విచక్రవాహనాలు వేసుకుని హల్చల్ చేస్తున్నారని, ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. తలుపులు వేసుకుని ఇంటి గేటుకు తాళం వేసుకుని ఇంట్లో ఉన్నా ఎక్కడెక్కడి నుంచో యువకులు వచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చే విద్యార్థినులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరిస్తున్నారని వివరించారు. పోలీసులు ప్రధాన వీధుల్లోనే రాత్రి గస్తీ తిరుగుతున్నారని, లోపల వీధుల్లోకి రావడం లేదని పేర్కొన్నారు. స్పందించిన ఎస్పీ మాట్లాడుతూ గంజాయి మూకలపై చర్యలు తీసుకుంటామని వివరించారు. రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సరైన పత్రాలు లేని 23 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. తనిఖీల్లో అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ కళ్యాణ్రాజు, ఎస్ఐలు ఖాజావలి, శ్రీనివాసరావు, నార్త్ సబ్ డివిజన్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేస్తున్నారు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు ఎస్పీ వద్ద నులకపేట ప్రజల ఆవేదన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ
మేము చాలా ప్రమాదంలో ఉన్నాం