నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 15న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు డెప్యూటీ మేయర్ షేక్ సజీల తాత్కాలిక మేయర్గా బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవిల సమక్షంలో సజీల తాత్కాలిక మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజీల మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మేయర్ రాజీనామాతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సజీల మేయర్గా బాధ్యతలు తీసుకున్నారని, త్వరలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రెగ్యులర్ మేయర్ ఎన్నికకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈనెల 25న గత మేయర్ రాజీనామా ఆమోదం కోసం అత్యవసర సమావేశం జరుగుతుందని వెల్లడించారు.