లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభ తిరుపతిలో మే 15 నుంచి 18 వరకు జరుగుతాయని సంఘ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సుభాని తెలిపారు. స్థానిక కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో జాతీయ మహాసభల లోగోను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ మహాసభలకు దేశ నలుమూలల నుంచి ఏఐవైఎఫ్ ప్రతినిధులతోపాటు జాతీయ నాయకత్వం పాల్గొంటుందని పేర్కొన్నారు. యువతను చైతన్యపరచడం, యువతలో సామాజిక స్పృహను పెంచడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యం అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాల చైతన్య,షేక్ వలి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి అఖిటి అరుణ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు ఖాసిం వలి, రెహ్మాన్, సుభాని తదితరులు పాల్గొన్నారు.