26లోపు రీ సర్వే పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

26లోపు రీ సర్వే పూర్తిచేయాలి

Mar 20 2025 2:33 AM | Updated on Mar 20 2025 2:32 AM

పొన్నూరు: పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికై న వల్లభరావుపాలెంలో ఈనెల 26 లోపు ప్రభుత్వ భూములు, నివాసాల రీసర్వే పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ తేజ చెప్పారు. బుధవారం గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను ఆయన తనిఖీ చేసి భూ రికార్డులు పరిశీలించారు. 5.24 సెంట్లు విస్తీర్ణంలోని చెరువు సరిహద్దులు, 7.63 సెంట్ల విస్తీర్ణంలోని తోక పోలాలను రోవర్ల ద్వారా తిరిగి నిర్ధారించే క్రమాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రీసర్వే బృందాలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జేసీ భార్గవ తేజ మాట్లాడుతూ వీఆర్వోలు, గ్రామ సర్వేయర్ల రోజువారి పని తీరును పరిశీలించి సర్వే త్వరగా పూర్తిచేయాలని తహసీల్దార్‌ మహ్మద్‌ జియావుల్‌హక్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో తెనాలి సర్వే ఇన్‌స్పెక్టర్‌ పి. పార్థసారధి, మండల సర్వేయర్‌ సత్యనారాయణ, ఆర్‌ఐ శ్రీనివాస్‌, వీఆర్‌ఓలు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మందులతో క్షయ వ్యాధి నివారణ

టీబీ విభాగ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌

తెనాలిఅర్బన్‌: మందులు సకాలంలో వాడితే క్షయను పూర్తిగా నివారించవచ్చని టీబీ విభాగ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రమేష్‌ పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని రోగుల ఇళ్లకు బుధవారం ఆయన వెళ్ళి వారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అలాగే వారు వాడే మందుల వివరాలు సక్రమంగా రికార్డు చేస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందులు ఒక్కరోజు వాడకపోయినా చాలా ప్రమాదమని చెప్పారు. ఆయన వెంట టీబీ తెనాలి యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమాదేవి, సూపర్‌వైజర్‌ పల్లెకొండ రవికుమార్‌, ఎం.లక్ష్మి, హెల్త్‌ విజిటర్స్‌ వి.వి.దిలీప్‌ కుమార్‌, కె.భార్గవి, వనజ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగోన్నతి వచ్చినా జీతం రాదట..!

తప్పుల తడకగా ఏఎన్‌ఎంల ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్‌

గుంటూరు మెడికల్‌: ఉద్యోగోన్నతి వచ్చినా జీతం రాదని తెలిసి పలువురు ఏఎన్‌ఎంలు లబోదిబోమంటున్నారు. అధికారులు చేసిన తప్పులకు తాము బలి అవుతున్నామని విలపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 266 గ్రేడ్‌–3 ఏఎన్‌ఎంలకు మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఫిమేల్‌గా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కౌన్సెలింగ్‌లో 15 మంది ఏఎన్‌ఎంలకు పొజిషన్‌ ఐడీ లేని ప్రాంతాల్లో అధికారులు పోస్టింగ్‌ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో శాంక్షన్‌ పోస్టు ఉన్నా.. పొజిషన్‌ ఐడీ లేకపోతే జీతం రాదు. ఈ విషయాన్ని కౌన్సెలింగ్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గమనించలేదు. ఖాళీల ప్రదర్శన బోర్డు ఏర్పాటు చేసినప్పుడు వాటిలో పొజిషన్‌ ఐడీలేని ప్రదేశాలు తీసివేసి, శాలరీ వచ్చే ప్రదేశాలు మాత్రమే చూపించాల్సి ఉంది. అయితే అవేవీ డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు పట్టించుకోలేదు. పొజిషన్‌ ఐడీ లేని ప్రాంతాల్లోనూ పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తీసుకుని కొత్త హోదాలో విధుల్లో చేరేందుకు కోటి ఆశలతో వెళ్లిన ఏఎన్‌ఎంలకు అక్కడి సిబ్బంది ఈ విషయం చెప్పారు. దీంతో లబోదిబోమంటూ 15 మంది ఏఎన్‌ఎంలు తిరిగి డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి వచ్చారు. అయితే గురువారం సాయంత్రం మరోమారు కౌన్సెలింగ్‌ చేపట్టి మిగిలిన ఖాళీల్లో జీతం వచ్చే ప్రదేశాలు ఉంటే అక్కడ పోస్టింగ్‌ ఇస్తామంటూ డీఎంహెచ్‌ఓ అధికారులు చెప్పారు. దీంతో ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

26లోపు రీ సర్వే పూర్తిచేయాలి 1
1/1

26లోపు రీ సర్వే పూర్తిచేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement