రాత‘కోతల’ రైటర్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర ట్రాఫిక్ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేస్తోంది. వారి అవినీతి అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. గుంటూరు నగర ట్రాఫిక్ పరిధిలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, వెస్ట్ సబ్డివిజన్లో ముగ్గురు ఎస్ఐలు, ఈస్ట్ సబ్డివిజన్లో ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు. ఒక ఎస్ఐ ప్రమాదంలో గాయపడి సిక్లో ఉన్నారు. ఈస్ట్, వెస్ట్ సబ్డివిజన్లలో కలిపి మొత్తం ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి సుమారు 80 మందికిపైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐలకు ఒక ప్రాంతాన్ని కేటాయించి ఒక అసిస్టెంట్ను ఇస్తారు. నిత్యం కేసులు రాయటంతో పాటు, ఆయా ప్రాంతాల్లో జరిగే
ప్రమాదాలకు సంబంధించిన అంశాలను ఎస్ఐ చూడా ల్సి ఉంటుంది. అయితే కొందరు ఎస్ఐలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ పెట్రోల్ వాడేసుకుంటున్నాడు!
వెస్ట్ ట్రాఫిక్ పరిధిలోనే ట్రాఫిక్ ఉన్నతాధికారి వద్ద పనిచేస్తూ జిల్లాలోని మరో పోలీసుస్టేషన్కు బదిలీ అయిన కానిస్టేబుల్ ప్రభుత్వ ద్విచక్రవాహనాన్ని సొంతానికి వాడేసుకుంటున్నాడు. నెలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 30 లీటర్ల పెట్రోల్ను సొంత అవసరాలకు ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ సుమారు తొమ్మిదేళ్ల పాటు పని చేసిన అతను బదిలీ అయినా ఇక్కడే తిష్టవేసి నెలవారీ వసూళ్ళు, ఎన్ఓసీ జారీల్లో చేతివాటం చూపిస్తున్నాడని సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. బదిలీ అయిన తర్వాత కూడా రెండు, మూడు సార్లు ప్రభుత్వం ద్వారా ఉచితంగా పెట్రోల్ వినియోగించినట్టు తెలుస్తోంది.
పరువు ‘బజారు’పాలు
గుంటూరు ఈస్ట్ పరిధిలో ఒక ఎస్ఐ, అతని అసిస్టెంట్లపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరు పట్నంబజారు, మార్కెట్, పూలమార్కెట్, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం తదితర ప్రాంతాల్లో అవినీతికి పాల్పడుతూ పరువును బజారుకీడస్తున్నట్టు సమాచారం. నిత్యం కేసులు నమోదు చేస్తూ.. అటుగా వచ్చే భారీ వాహనాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. చిరు వ్యాపారులపైనా ప్రతాపం చూపి ంచి భారీగా దండుకుంటున్నారని తెలుస్తోంది.
రాంగ్రూట్లో ట్రాఫిక్
సిబ్బంది అవినీతితో అప్రతిష్టపాలు చలానాల సొమ్ము జేబులో వేసుకున్న ఎస్ఐ ప్రభుత్వం వాహనం వాడుకుంటున్న కానిస్టేబుల్ రైటర్గా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్పై ఆరోపణల పరంపర
చలానాల సొమ్ము బొక్కేశారు
వెస్ట్ సబ్డివిజన్ పరిధిలోని లాడ్జి సెంటర్, అమరావతి రోడ్డు, కొరిటెపాడు రోడ్డు చూసుకునే ఒక ఎస్ఐ, అతని అసిస్టెంట్ అవినీతి పరాకాష్టకు చేరింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీలకు ఆపిన సమయంలో పెండింగ్ చలానాలు ఉంటే.. వారిని భయపెట్టి మరీ వారి వద్ద నగదు తీసుకుని, ఆ డబ్బు చలానాలకు జమ చేయకుండా జేబులు నింపుకుటున్నారని ఆ శాఖ సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. వీరు డబ్బు తీసుకున్న వాహనాలను మరో ఎస్ఐ ఆపి చలానాలు కట్టాలని అడిగితే వాహనదారులు ఇంతకుముందే ఓ ఎస్ఐకు కట్టామని చెప్పడంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఇలా పలు ఫిర్యాదులు రావడంతో పరువు పోతుందనే భయంతో ఆ ఎస్ఐ, అతని అసిస్టెంట్ దిగమింగిన డబ్బులు చెల్లించిన ఘటనలూ ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు.
మరో కానిస్టేబుల్ నేరుగా రైటర్ అవతారం ఎత్తాడు. స్టేషన్లో తానే రైటర్నని, స్టేషన్ అధికారి పనులన్నీ కూడా తానే చక్కబెడతానంటూ చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యానగర్ సమీపంలో ఒక వైద్యుడి వాహనాన్ని, ఒక ద్విచక్ర వాహనదారుడు వచ్చి ఢీకొట్టాడు. వైద్యుడు ఫిర్యాదు చేసిన క్రమంలో సీఐ కేసు కట్టాలని చెప్పినప్పటికీ, సదరు రైటర్ మాత్రం రూ.5వేలు ఇచ్చే వరకు కేసు నమోదు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి స్పెషల్ డ్రైవ్లో తీసుకు వచ్చిన వాహనాలూ కోర్టు వెళితే శిక్ష పడుతుందంటూ వేలాది రూపాయిలు గుంజుకుని వాహనాలు వదలి పెడుతున్నాడని తెలుస్తోంది.
అవినీతికి పాల్పడితే చర్యలు
ట్రాఫిక్ విభాగంలో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. పలు విషయాలు మా దృష్టికీ వచ్చాయి. అక్రమ వసూళ్ళకు పాల్పడే వారి గురించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం.
–ఎం.రమేష్, (డీఎస్పీ, ట్రాఫిక్)