ప్రజల భాగస్వామ్యంతోనే ‘స్వచ్ఛ మంగళగిరి’ సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే ‘స్వచ్ఛ మంగళగిరి’ సాధ్యం

Mar 16 2025 1:50 AM | Updated on Mar 16 2025 1:48 AM

మంగళగిరి టౌన్‌: స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శనివారం మంత్రి పాల్గొన్నారు. మొదట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ రహిత స్టాల్స్‌ను పరిశీలించారు. డ్రాయింగ్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పాత్రాలు అందజేశారు. స్వచ్ఛ మంగళగిరి పోస్టర్‌ను, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అధికారులు, నాయకులు, విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని చెప్పారు. ఇంట్లోని చెత్తను బహిరంగ ప్రదేశాలు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయకుండా ప్రతిరోజు ఇంటి ముందుకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాలకు అందజేయాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని చెప్పారు. కోరిన వెంటనే ఎస్‌ఏఈఎల్‌, దివిస్‌ సంస్థలు సీఎస్‌ఆర్‌ కింద నిధులు ఇవ్వడంతో పాటు స్వచ్ఛ మంగళగిరికి సపోర్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఏఈఎల్‌ సంస్థ రూ. 1.25కోట్లతో అన్ని సచివాలయాలకు శానిటేషన్‌ కిట్స్‌ అందజేయగా, దివిస్‌ సంస్థ స్వచ్ఛ అంబాసిడర్స్‌కి జీతాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛ మంగళగిరి ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా 365 రోజుల్లో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను దేశంలోనే చెత్త రహిత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. త్వరలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, నగర పాలక సంస్థ కమిషనర్‌ అలీమ్‌బాషా, అడిషనల్‌ కమిషనర్‌ శకుంతల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement