మంగళగిరి: మంగళాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులతో సాగిన స్వామి దివ్య రథోత్సవంతో ఉత్సవాలు చివర దశకు చేరాయి. శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. కై ంకర్యపరులుగా నిడమర్రుకు చెందిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి దంపతులు వ్యవహరించారు. రాత్రి స్వామికి ధ్వజావరోహణం, కేళీ గుర్రంపై విహారం, దొంగల దోపిడీ నిర్వహించారు. ఉదయం చూర్ణోత్సవం అనంతరం స్వామి వసంతోత్సవం జరుపుకుంటూ పురవీధుల్లో విహరించారు. కోనేరు వద్ద చక్రస్నానం చేశారు. స్వామితో పాటు కోనేరులో స్నానం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అనంతరం పూర్ణాహుతి, ధ్వజావరోహణం నిర్వహించారు. ఈ ఉత్సవంలో గరుత్మంతుడు మొదట పిలిచిన దేవతలందరినీ తిరిగి వారి స్థానాలకు పంపుతాడు. అనంతరం స్వామి కేళీ గుర్రంపై పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో ఏ. రామ కోటిరెడ్డి పర్యవేక్షించారు.
నృసింహుని సేవలో
ఉప లోకాయుక్త రిజిస్ట్రార్ రజిని
శ్రీ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాష్ట్ర ఉప లోకాయుక్త జస్టిస్ రజిని దంపతులు దర్శించుకున్నారు. ఎగువ దిగువ సన్నిధులలో స్వామిని దర్శించుకున్న దంపతులకు ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏ. రామకోటిరెడ్డి, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర ఘనంగా స్వాగతం పలికారు. రజిని దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ధ్వజారోహణం, కేళీ గుర్రంపై విహారం దొంగల దోపిడీతో ముగిసిన బ్రహ్మోత్సవాలు