పెదకాకాని: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ ఉప లోకాయుక్త జస్టిస్ పి. రజిని దంపతులు సందర్శించారు. ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్తో పాటు అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు. తొలుత రజిని దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ ఉప కమిషనర్ లీలాకుమార్ న్యాయమూర్తి దంపతులకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ముగిసిన సీనియర్
ఇంటర్ పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు శనివారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 87 పరీక్ష కేంద్రాల పరిధిలో 29,405 మందికి గానూ 28,901 మంది హాజరయ్యారు. ఆర్ఐవో జీకే జుబేర్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల మొత్తానికి గానూ జిల్లాలో ఒక మాల్ ప్రాక్టీసు కేసు నమోదైంది.
వైభవంగా శ్రీవారి కల్యాణం
నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ప్రాతః కాల ఆరాధన, స్వామికి తిరుమంజన స్నపన, అలంకార పూజ, నిత్యార్చన, నిత్య హోమం, బలిహరణ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు భక్తిప్రపత్తులతో చేపట్టారు. భక్తులు పెద్దసంఖ్యలో తిలకించారు. ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం నిత్య హోమం నిర్వహించారు. అనంతరం, స్వామివారి రథోత్సవం భక్తుల గోవింద నామస్మరణతో ఆర్.అగ్రహారం ప్రధాన వీధుల్లో కొనసాగింది. మంగళవాయిద్యాలు, డప్పులు, దేవతామూర్తుల వేషధారణలతో రథోత్సవం ఆకట్టుకుంది. ఆలయ వ్యవస్థాపకులు కన్నా లక్ష్మీనారాయణ, కార్యదర్శులు పాతకోట బ్రాహ్మణయ్యనాయుడు, దాసరి భాస్కరరావు పాల్గొన్నారు.
రేపు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి శనివారం తెలిపారు. టోర్నమెంట్ సోమవారం 8:30గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి హాజరై టోర్నమెంట్ను ప్రారంభిస్తారని చెప్పారు. స్పోర్ట్స్ అండ్ కల్చర్ కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, ఈసీ మెంబర్స్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
మల్లేశ్వరస్వామి సేవలో ఉప లోకాయుక్త జస్టిస్ రజిని
మల్లేశ్వరస్వామి సేవలో ఉప లోకాయుక్త జస్టిస్ రజిని