● 2,700 మంది తిలకించేలా ఏర్పాట్లు
● భక్తుల రాక కోసం 300 బస్సులు ● టీటీడీ ఈవో శ్యామలరావు
తాడికొండ: వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయంలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2,700 మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా 300 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పుష్పాలంకరణ పనులు వేగంగా చేస్తున్నారు. దాదాపు నాలుగు టన్నుల పూలు, 30 వేల క్లట్ ఫ్లవర్స్తో అలంకరణ పనులు చేస్తున్నారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరిస్తున్నారు.
తొలుత సంగీత కార్యక్రమాలు
హింధూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చైన్నెకి చెందిన నిత్యశ్రీ మహదేవన్ గ్రూప్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6:15 గంటల వరకు చైన్నెకి చెందిన ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తలను ఆలపించనున్నారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కీర్తనలు ఆలపించనున్నారు. శ్రీనివాస కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఒక బ్యాగ్లో పంపిణీ చేయనున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణ ప్రాంతంలో ఐదు వేల ఫ్లడ్ లైట్లు, 25 జనరేటర్లు, 18 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విద్యుద్దీప అలంకరణల్లో దేవతామూర్తులను, ఆలయాన్ని తీర్చిదిద్దారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, కలెక్టర్ నాగలక్ష్మి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సతీష్ కుమార్, సీఈ సత్యనారాయణ పలువురు జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.