గొలుసు చోరీలతో జల్సా | - | Sakshi
Sakshi News home page

గొలుసు చోరీలతో జల్సా

Mar 15 2025 1:43 AM | Updated on Mar 15 2025 1:44 AM

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): గొలుసు చోరీలతో జల్సాలు చేస్తున్న ఏడుగురు దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. వారి నుంచి రూ.16.12 లక్షల విలువైన సుమారు 162 గ్రాముల బంగారు గొలుసులు, ఐదు మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), తెనాలి డీఎస్పీ జనార్దనరావుతో కలిసి కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ ఏడాది జనవరి 27న తెనాలికి చెందిన ఓ మహిళ చెంచు పేట బ్రిడ్జి వైపు నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకెళ్లి మోటారుసైకిల్‌పై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో తెనాలి మూడో పట్టణ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెనాలి చినరావూరుతోట వాసి పోతర్లంక సాయిమాధవ్‌ ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతను జల్సాల కోసం తెనాలి చినరావూరుతోటకు చెందిన ఆరుగురితో ముఠాగా ఏర్పడి రెండేళ్లుగా ఈ చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. ద్విచక్ర వాహనాలనూ దొంగిలించినట్టు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో మహమ్మద్‌ సమీర్‌, ధనావత్‌ హనుమంత్‌నాయక్‌, సయ్యద్‌ కరిముల్లా, షేక్‌ బారావలి అలియాస్‌ బారా, గీతాంజలి స్కూల్‌ రోడ్డులో ఉంటున్న షేక్‌మాగ్బుల్‌, కొల్లిపర మండలం అన్నవరం గ్రామ వాసి అమర్తలూరి నానీని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఏడుగురు దొంగల ముఠా అరెస్టు రూ.16.12 లక్షల విలువైన 162 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం ఐదు మోటార్‌ సైకిళ్లు కూడా సీజ్‌ వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్‌

వయసు 19.. గొలుసులు తెంచడంలో నేర్పరి

19 ఏళ్ల సాయిమాధవ్‌ గొలుసులు తెంచడంలో నేర్పరి. ఇతనే సూత్రధారి. గొలుసులు తెంచేవాడు. మిగతావారు మోటార్‌సైకిళ్లతో సిద్ధంగా ఉండి ఇతడిని తీసుకుని పరారయ్యేవారు. దొంగిలించిన గొలుసులను తెనాలి గీతాంజలి స్కూల్‌ రోడ్డులో ఉంటున్న షేక్‌ మక్బూల్‌కు ఇచ్చి అతనికి తెలిసిన వారికి మాత్రమే అమ్మేవారు. ఆ నగదుతో అందరూ జల్సాలు చేసేవారు. ధనావత్‌ హనుమంతునాయక్‌పై గతంలో మోటారుసైకిల్‌ చోరీ కేసు, సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. మిగిలిన వారిపై కేసులు లేవు. ఇటీవల తెనాలి మూడో పట్టణ పీఎస్‌తోపాటు బాపట్ల జిల్లా వేమూరు పీఎస్‌ పరిధిలోని చావలి గ్రామంలోనూ ఈ ముఠా గొలుసు చోరీలకు పాల్పడింది. చేబ్రోలులోనూ మోటారుసైకిల్‌, బంగారు గొలుసు దొంగిలించింది. దొంగలను పట్టుకున్న తెనాలి మూడో పట్టణ పీఎస్‌ సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐలు ప్రకాష్‌రావు, కరీముల్లా, కానిస్టేబుళ్లు పి.మురళీ, కె.బాబురావు, ఎస్‌.జైకర్‌, ఎన్‌.శ్రీనివాసరావు, డి.సురేష్‌బాబు, ఎ.అనిల్‌కు ఎస్పీ రివార్డులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement