ఉత్కంఠ మిన్నంటెన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ మిన్నంటెన్‌

Mar 15 2025 1:43 AM | Updated on Mar 15 2025 1:44 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి చదువు కీలకదశకు చేరింది. సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు చదువులో తలమునకలై ఉండగా, వారిని సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు నిమగ్నమై ఉన్నారు. బిడ్డల చదువులపై తల్లిదండ్రులూ ఉద్విగ్నక్షణాలు అనుభవిస్తున్నారు. ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 30,410 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 150 కేంద్రాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.

●హాల్‌టికెట్లు పొందిన విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలను సందర్శించి రోజూ పరీక్షకు ఎలా వెళ్లాలి.. ఎంత సమయం ముందు ఇంటి నుంచి బయలుదేరాలనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

●పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకల్లా కచ్చితంగా పరీక్ష కేంద్రాల వద్ద ఉండేలా చూసుకోవాలి.

●ఉదయం 8.45 నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 9.30 తరువాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని గుర్తుంచుకోవాలి.

●హాల్‌ టికెట్లపై ముద్రించిన తమ వివరాలు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జెక్టులు, పరీక్ష కేంద్రం పేరు, చిరునామా సరి చూసుకోవాలి. వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ముందుగానే తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లి, సరి చేయించుకోవాలి.

●హాల్‌ టికెట్‌పై ఉన్న ఎన్‌రోల్‌ నంబరు ఆధారంగా కేటాయించిన గదులకు చేరుకోవాలి.

●పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రంపై ఏడు అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్‌ ఉంటుంది. అది ఉందో లేదో చూసుకోవాలి.

●పరీక్ష గదిలోకి ప్రవేశించగానే బార్‌ కోడింగ్‌తో కూడిన ఓఎంఆర్‌ షీట్‌, ప్రశ్నపత్రం, ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇస్తారు. ఇన్విజిలేటర్‌ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఓఎంఆర్‌ షీట్‌ పూరించాలి. దానిపై అనవసరమైన గీతలు గీయరాదు. వ్యర్థ రాతలు రాయరాదు.

● ఓఎంఆర్‌ షీట్‌పై విద్యార్థి పేరు, రాయబోవు పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివీ నిర్ధారించుకోవాలి.

●9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగుస్తుంది. ఈ మధ్య సమయంలో విద్యార్థులను బయటకు అనుమతించరు.

●గుర్తింపు కార్డు కలిగిన పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు, స్క్వాడ్‌ బృందాలనే పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు.

●పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుశాఖ 144 సెక్షన్‌ అమలు చేయడంతోపాటు విస్తృత రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది.

●ప్రశ్నపత్రం లీక్‌ అయిందని, పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిందని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా, విద్యార్థులు పరీక్షలకు ప్రశాంతంగా హాజరు కావాలి. ఒక వేళ్ల ఏదైనా సెంటర్‌ నుంచి ప్రశ్నపత్రం లీకేజీకి గురైతే, అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

●పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పక్కవారి పేజీలను చూసి సమాధానాలు రాయాలనే ఆలోచన వీడాలి. కాపీయింగ్‌కు పాల్పడినా, జేబులో స్లిప్పులు పెట్టుకుని వచ్చినా, పరీక్ష కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష రాసే సమయంలో ఏ విద్యార్థ్ధి వద్ద అయినా స్లిప్పులు కనిపిస్తే పరీక్షల నుంచి డీబార్‌ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి.

●ఓఎంఆర్‌ షీట్‌, ఆన్సర్‌ బుక్‌లెట్లలో ఏ ఒక్క పేజీని చింపినా మాల్‌ప్రాక్టిసుగా పరిగణిస్తారు. జాగ్రత్తగా ఉండాలి.

పదో తరగతి పరీక్షలకు సర్వంసిద్ధం చదువులో తలమునకలైన విద్యార్థులు సంసిద్ధంలో ఉపాధ్యాయులు నిమగ్నం తల్లిదండ్రుల్లోనూ ఉద్విగ్నం 17 నుంచి పరీక్షలు ప్రారంభం పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వ మార్గదర్శకాలు

విస్తృత ఏర్పాట్లు

పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశాం. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయి. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. పరీక్ష కేంద్రాలకు వెళ్లి, వచ్చేందుకు ఆర్టీసీ బస్సులో హాల్‌ టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

– సీవీ రేణుక, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement