గుంటూరు వెస్ట్: వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని అందరికీ అర్ధమయ్యేలా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ అని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కొనియాడారు. మొల్లమాంబ సాఽహిత్య సేవలను తెలుగు ప్రజలు గుర్తుంచుకుంటారని వివరించారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తోపాటు డీఆర్వో షేక్ ఖాజావలి, బీసీ వెల్ఫేర్ అధికారి భవానీ, కుమ్మరి, శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.నాగేశ్వరి, కుమ్మరి, శాలివాహన సమన్వయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యు.వెంకటేశ్వర్లు, అధికారులు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు పుష్పాంజలి ఘటించారు.
కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్లో వాక్థాన్
మంగళగిరి: కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంతా సింగ్ తెలిపారు. అంతర్జాతీయ కిడ్నీ డే సందర్భంగా గురువారం ఉదయం ఎయిమ్స్లో వైద్యులు, మెడికల్ విద్యార్థులతో వాక్థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శాంతా సింగ్ మాట్లాడుతూ కిడ్నీ అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం శరీరంలోని ప్రతి అవయంపైనా పడుతుందన్నారు. కిడ్నీలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. నేటి ఆధునిక సమాజంలో కిడ్నీల విక్రయాలు జరగడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీమంత కుమార్ దాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెచ్వోడి డాక్టర్ ఉత్తర దాస్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.
తెనాలిలో ముగిసిన ప్రత్యేక సదరం క్యాంప్
తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారంతో ముగిసింది. ఈఎన్టీ, అఫ్తమాలజీ, ఆర్ధోపెడిక్, సైక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులకు వైద్య పరీక్షలు చేశారు. క్యాంప్లో పలు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. క్యాంప్ను వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు.
మిర్చిని ఆరబెట్టుకుని
తీసుకురావాలి
మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ ఊపందుకుందని, రోజుకు 1.50 లక్షల నుంచి 1.80 లక్షల మిర్చి బస్తాలు యార్డుకు వస్తున్నాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యార్డుకు రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు ఎండు మిర్చిని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందుతున్నారని వెల్లడించారు. గత ఐదు రోజులుగా వస్తున్న మిర్చిలో తేమ శాతం, దుమ్ము, ధూళి ఉండటం వల్ల దాని ప్రభావం ధరలపై పడుతోందని తెలిపారు. రైతులు కల్లాల్లోనే మిర్చిని ఆరబెట్టుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
కవయిత్రి మొల్లమాంబకు పుష్పాంజలి