పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో నిర్వహించిన థియేటర్స్ డే వేడుక వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ వినోదం, విజ్ఞానం మేళవింపుతో వీవీఐటీ విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అలరించాయి. ఈ వేడుకలో విభాగాల వారీగా ప్రదర్శించిన ఎనిమిది నాటికలను విద్యార్థులు వారి వేషధారణ, హావభావాలతో రక్తికట్టించారు. కార్యక్రమానికి వర్ధమాన నటుడు, రంగస్థల యువ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ నందీపురస్కార గ్రహీత రౌతు వాసుదేవరావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా విజేతలకు వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ బహుమతులు అందజేశారు. కలలు, ఆశయాలు అందుకునే క్రమంలో ఓ కుటుంబంలో తండ్రీకొడుకుల మధ్య ఏర్పడే అపోహల నేపథ్యంలో ఈఈఈ విద్యార్థులు రూపొందించిన కుటుంబ కథ ‘అవును మా నాన్న రైతే‘ ప్రథమ బహుమతి అందుకోగా, రియల్ఎస్టేట్ రంగంలో వినూత్న పోకడలను తెలుపుతూ హాస్య రూపంలో మెకానికల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘పుష్పవల్లి నిలయం ద్వితీయ బహుమతి అందుకుంది. కార్యక్రములో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్స్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిన్ డీన్ డాక్టర్ ఎన్.కుమారస్వామి, థియేటర్స్ డే సమన్వయకర్త షేక్ రసూల్, అధ్యాపకులు పాల్గొన్నారు.