గుంటూరు ఎడ్యుకేషన్: జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వకుండా వెంటనే ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఏడాది పొడవునా మార్కులు, ర్యాంకుల పేరుతో సెలవుల ఊసే లేకుండా కళాశాలకే పరిమితమైన విద్యార్థులకు వెంటనే తదుపరి తరగతులు ప్రారంభించడం తగదనే వాదన సర్వత్రా వినిపిస్తున్నా..ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. గురువారం జూనియర్ ఇంటర్ పరీక్షలు ముగియడంతోనే పలు కాలేజీల యాజమాన్యాలు మధ్యాహ్నం నుంచే సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభించాయి. ఈ మేరకు విద్యార్థులను మధ్యాహ్నం నుంచి కళాశాలకు పంపాలని తల్లిదండ్రులకు ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపాయి. లేకుంటే ఎంపీసీ విద్యార్థులను జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్ తదితర ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలతోపాటు బైపీసీ విద్యార్థులను నీట్కు సన్నద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని సందేశాల్లో పేర్కొన్నాయి.
ఏప్రిల్ 7 నుంచి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని, ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలని అకడమిక్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్న కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సెలవులే లేకుండా యథావిధిగా తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాలలు తిరిగి జూన్ 2న పున: ప్రారంభం కావాల్సి ఉన్నాయి. జూనియర్ ఇంటర్ పరీక్షలు ముగిసిన రోజే ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించడం ద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముగిసిన జూనియర్ ఇంటర్ పరీక్షలు
ఈనెల 1న ప్రారంభమైన జూనియర్ ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు గురువారం ముగిశాయి. గురువారం జరిగిన కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల పరిధిలో కేటాయించిన 34,874 మంది విద్యార్థుల్లో 33,972 మంది హాజరయ్యారు. అలాగే సీనియర్ ఇంటర్ ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు శనివారం ముగియనున్నాయి.
వేసవి సెలవుల్లేవు.. ఏకధాటిగా చదువులే
జూనియర్ ఇంటర్ పరీక్షలు ముగిసిన రోజునే సీనియర్ ఇంటర్ తరగతులు ప్రారంభం ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల వింత వైఖరి ఏప్రిల్ 7 నుంచి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అనుకూలంగా మలచుకున్న వైనం
నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు చేస్తాం
జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 7 వరకు సీనియర్ ఇంటర్ తరగతులు నిర్వహించేందుకు వీల్లేదు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపు రద్దుకు ఇంటర్మీడియెట్ బోర్డుకు సిఫార్సు చేస్తాం. ద్వితీయ సంవత్సర విద్యార్థులకూ పోటీ పరీక్షల శిక్షణ పేరుతో సెలవులను హరించడం తగదు.
– జీకే జుబేర్, ఆర్ఐవో, గుంటూరు