గుత్తికొండ బిలంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు | - | Sakshi
Sakshi News home page

గుత్తికొండ బిలంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

Mar 13 2025 11:46 AM | Updated on Mar 13 2025 11:42 AM

పిడుగురాళ్ల: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుత్తికొండ బిలాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి టి.సుజాత బుధవారం సందర్శించారు. గుత్తికొండ బిలంలోని పుణ్యక్షేత్రంలో ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హైకోర్టులో గుమస్తాగా పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన సంధ్యానాయక్‌ కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో పరామర్శించారు. ఆమె వెంట పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన ఆర్డీఓ

అచ్చంపేట: మండలంలోని మాదిపాడులో ప్రభుత్వ భూములను ఆర్డీఓ జి.రమాకాంత్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. మాదిపాడు నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అంతరాయం కలుగచేస్తున్న వారి భూములను పరిశీలించి, రోడ్డు నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని సూచించారు. అనంతరం కృష్ణానదిపై మంజూరైన వంతెన నిర్మాణానికి కావలసిన అనుమతులు, భూసేకరణ తదితర వివరాలను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సుమారు 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములుండగా వాటిని ఏవిధంగా వినియోగంచుకోవాలనే విషయంపై తహసీల్దార్‌తో చర్చించారు. వారి వెంట వీఆర్వోలు, గ్రామ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

యార్డులో 1,40,254 మిర్చి బస్తాలు విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు బుధవారం 1,39,436 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,40,254 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాలకు సగటున ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 68,733 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

కబ్జాపై కదిలిన

యంత్రాంగం

అక్రమాలకు పాల్పడిన

అధికారులకు నోటీసులు

గురజాల రూరల్‌: గురజాల జగనన్న కాలనీలో మొత్తం 70 సెంట్ల స్థలాన్ని కూటమి నేతలు కబ్జా చేసిన వైనంపై రా‘జాగా’ కబ్జా అనే శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అక్రమాలకు పాల్పడిన పలువురు అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. పలువురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వి.మురళీకృష్ణ మాట్లాడుతూ గతంలో రీ సర్వే సరిగ్గా చేయని ఇద్దరు సర్వేయర్లకు, జగనన్న కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వోకు షోకాజ్‌ నోటీసులు అందించామన్నారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. సర్వే చేయించి పూర్తిగా విచారణ జరిపిస్తామన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు విచారణలో తేలితే రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామన్నారు.

గుత్తికొండ బిలంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు 
1
1/1

గుత్తికొండ బిలంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement