గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆమెరికా వ్యవసాయ విద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య ఎంఎస్ రెడ్డి బుధవారం సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో ముఖాముఖీ చర్చల్లో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ మన భవిష్యత్తును కాపాడుకునేందుకు మొక్కలు, నేలల ఆరోగ్యం కాపాడుకోవటంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సమస్యలను, ఎలా అధిగమించాలి అనే అంశాలపై ఆయనతో చర్చించారు. విదేశాల్లో చేసిన వ్యవసాయ పరిశోధనలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రొఫెసర్ ఎంఎస్ రెడ్డి వివరించారు. వ్యవసాయ విద్యార్థులకు వ్యవసాయం, వాటి మెలకువలను వివరించారు. అనంతనం విశ్వవిద్యాలయం అధికారులు ఎంఎస్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.