గుంటూరు వెస్ట్: ఉద్యోగులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు చర్యలు ఉంటాయని వివరించారు. అన్ని శాఖల్లో రాష్ట్ర స్థాయి కార్యాలయం జారీ చేసిన ఫార్మెట్లను సిద్ధం చేయాలన్నారు. స్వచ్చాంధ్ర కార్యక్రమాలు, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యా శాఖ, సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, ఆసుపత్రులు తదితర శాఖలు నిర్ధేశించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలో జరుగుతున్న ప్రజలు, దాతలు, ప్రభుత్వం భాగస్వామ్యం (పీ–4) సర్వే వేగవంతం చేసి సత్వరమే పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం పీ–4 కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించడానికి క్యూ ఆర్ కోడ్తో రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్, జీఎంసీ కమిషనర్ పులిశ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు ఆవిష్కరించారు.
కలెక్టర్ నాగలక్ష్మి