నగరం: శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన అవిష్కరణలు మానవాళి సుఖ జీవనానికి దోహదపడుతున్నాయని అచార్య నాగార్జున విశ్వవిదాలయం ప్రొఫెసర్ డాక్టర్ పీవీ కృష్ణ చెప్పారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాలలో బుధవారం ‘జీవ శాస్త్రంలో నూతన పోకడలు’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తెలిపారు.నేడు అన్ని రంగాల్లో పరిశోధనలు విజయవంతం కావడంతో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయని వివరించారు. ఆక్వా రంగంలో నూతన పోకడలతో రొయ్యలు, చేపలు పెంపకంలో దిగుబడులు పెరిగాయని, ఎగుమతులు కూడా అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎన్యూ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ కె. కస్తూర్, డాక్టర్ గిరిధర్లు నూతన అవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చియ్య చౌదరి, ప్రిన్సిపాల్ అనగాని హరికృష్ణ, అకడమిక్ డైరెక్టర్ వి. వెంకటస్త్రశ్వరావు, బోటనీ హెచ్వోడీ పి. వెంకటనారాయణ, జువాలజీ హెచ్వోడీ కె.సురేష్బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.
శ్రీవారి తిరు కల్యాణం.. రమణీయం
రేపల్లె రూరల్: పట్టణంలోని ఉప్పూడి రోడ్డులో గల శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా లక్ష్మి, గోదా సమేత వేంకటేశ్వరులకు మంగళస్నానాలు చేయించి, వధూవరులుగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడమ కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తిరు కల్యాణ వేడుకలను తిలకించి, స్వామికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. రాత్రి శ్రీలక్ష్మి, గోదా, వెంకటేశ్వరుడి విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.