తెనాలి: స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈనెల 14 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. సీతారాముల కల్యాణం విశిష్టతను బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథశర్మ తన ప్రవచనంలో వివరించారు. శ్రీరామనామ మహిమను భక్తులకు తెలియజేశారు. వైఖానస ఆగమ పండితులు నారాయణం గోవర్ధన్ లక్ష్మీ రఘురాం, వేదాంతం నాగమారుతి, రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వీ కిరణ్, సురేష్ బృందం వైదిక క్రతువును నిర్వహించింది. సాయంత్రం గాయని, ‘పాడుతా తీయగా’ మహాసంగ్రామం విజేత సాయి వేదవాగ్దేవి చేసిన భక్తి గీతాలాపన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాలకు ములుకుట్ల విశ్వనాథ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భగవద్ రామానుజ దాసుడు జంధ్యం రామారావు దంపతులు కార్యక్రమాల నిర్వహణకు భక్తిపూర్వక సహకారం అందించారు. భక్తులకు ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ జరిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవాసమితి, శ్రీవిఖనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి అనురాధ, వెంకటేశ్వరరావు ,గుడివాడ బాలకృష్ణ , మడుపల్లి చంద్రశేఖర్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.