అజేయం.. అమేయం ఆమె.. అకుంఠిత దీక్ష, పోరాటపటిమ ఆమె సొంతం.. ఓర్పు, నేర్పు వంటి పదాలు ఆమెను చూసే పుట్టాయేమో.. భగభగమండే బడబాగ్నిని సైతం చిరునవ్వుతో చల్లార్చగల నేర్పరి.. గుండెలను పిండేసే బాధనైనా సంకల్పబలంతో దిగమింగగల ఓర్పరి.. అనితరసాధ్యమైన లక్ష్యాలనూ అవలీలగా ఛేదించగల ధీశాలి. ఆమె సహచర్యం దివ్యౌషధం.. ఆమె మార్గదర్శకం అనన్యసామాన్యం.. ఒక్క మాటలో చెప్పాలంటే అవనితలాన అద్భుతం ఆమె. అందుకే ఆమె ఆదిశక్తి అయింది. అన్ని రంగాల్లో రాణిస్తూ నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామూర్తుల విజయగాధలతోపాటు అంతరంగాన్ని ఆవిష్కరించే యత్నమిదీ.. – సాక్షి, నెట్వర్క్
మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ స్కేటింగ్లో అంతర్జాతీయ ఖ్యాతి సాధించారు. ఆమె 13 ఏళ్ళ వయస్సులోనే దేశంలోనే నంబవర్ వన్ స్కేటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. జెస్సీని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది. జెస్సీ 31.98 పాయింట్లు సాధించి ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానంలో రాణించి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్న జెస్సీ 2021 నుంచి స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆమె జాతీయ పోటీలలో ఒక గోల్డ్, ఒక సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. రాష్ట్ర పోటీలలో రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, రెండు బ్రాంజ్, జిల్లా స్థాయి పోటీలలో నాలుగు గోల్డ్,ఎనిమిది సిల్వర్ మెడల్స్ సాధించారు. అథ్లెటిక్స్, నృత్యం, పెయింటింగ్లోనూ జెస్సీ రాణిస్తుండడం విశేషం.
ఆకాశంలో సగం అన్ని రంగాల్లో ఆమెదేపైచేయి రాణిస్తున్న సీ్త్రమూర్తులు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
స్కేటింగ్ జెస్సీ