గుంటూరు వెస్ట్: స్థానిక శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పునర్నిర్మాణ పనులు అధికారులందరూ సమష్టిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జికి సంబంధించి భూ సేకరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ను ఫైనలైజ్ చేయాలని, మే మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలిపారు. నిర్మాణ సమయంలో అండర్ గ్రౌండ్ వాటర్పైపులు, టెలిఫోన్ కనెక్షన్లు, ఎలక్ట్రికల్ కేబుల్స్, డ్రెయినేజీ వంటి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా శంకర్ విలాస్ ఫ్లైఓవర్కు అటు, ఇటువైపు ఉన్న బ్రాడీపేట, అరండల్పేట ప్రాంతాల్లో పైపులైన్ క్లియరెన్స్కు చర్యలు చేపట్టాలన్నారు. పునర్నిర్మానిర్మాణ పనులతో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని పేర్కొన్నారు . జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు.
15న జెడ్పీ సర్వసభ్య సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు గురువారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జెడ్పీలో ఏడుస్థాయీ సంఘ సమావేశాలు జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుంచి జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.