గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల విద్యార్థులు ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని గుంటూరు జిల్లా కన్వీనర్ టి. జయప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడికొండలోని ఏపీఆర్ స్కూల్ (జనరల్) బాలురు, గుంటూరులోని మైనార్టీ బాలికలు, బాలుర పాఠశాలల్లో 5వ తరగతితో పాటు 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాత గుంటూరు నందివెలుగు రోడ్డులోని ఏపీఆర్జేసీ మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు వెబ్సైట్తో పాటు 87126 25038 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు.