
విద్యాశాఖ సైట్లో మున్సిపల్ టీచర్ల సీనియార్టీ జాబితా
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరపాలకసంస్థ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, లాంగ్వేజ్ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులకు సంబంధించిన ఉమ్మడి సీనియార్టీ జాబితాను deognt.blogspot.inలో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ శనివారం ఓప్రకటనలో తెలిపారు. సీనియార్టీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 10వ తేదీలోపు లిఖితపూర్వకంగా డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
పెదనందిపాడులో
27.4 మి.మీ వర్షం
కొరిటెపాడు: గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా పెదనందిపాడు మండలంలో 27.4 మిల్లీమీటర్ల వర్షం పడగా, అత్యల్పంగా తాడేపల్లి మండలంలో 0.2 మి.మీ వర్షం పడింది. సగటున 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కాకుమాను మండలంలో 14.8 మి.మీ, గుంటూరు పశ్చిమ 7.2, ప్రత్తిపాడు 7.2, గుంటూరు తూర్పు 6.2, పొన్నూరు 4.2, పెదకాకాని 3, తుళ్లూరు 2.2, దుగ్గిరాల 1.2, తాడికొండ 1.2, ఫిరంగిపురం 1, మేడికొండూరు మండలంలో 0.4 మి.మీ చొప్పున వర్షం పడింది.
11న కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యూవల్కు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యూవల్కు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్ పి.కళావతి శనివారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఓరియెంటల్ డిగ్రీ కళాశాలల్లో గత విద్యాసంవత్సరంలో కాంట్రాక్టు ప్రాతిపదికన అధ్యాపకులుగా పని చేసిన వారికి జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 11న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. సంబంధిత కాంట్రాక్టు అధ్యాపకులు రెన్యూవల్ ప్రాతిపదికన పని చేసేందుకు ఈనెల 9వ తేదీలోపు సదరు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఈనెల 12న కాంట్రాక్టు పద్ధతిపై పని చేసేందుకు రెన్యూవల్ అయిన అభ్యర్థులు 2024–25 విద్యాసంవత్సరానికి అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. జోన్–3 పరిధిలోని ప్రభుత్వ కళాశాలల్లో 38, ఓరియెంటల్ కళాశాలల్లో 10 పోస్టుల చొప్పున రెగ్యులర్ అధ్యాకుల రాకతో డిస్టర్బ్ అయిన కాంట్రాక్టు అధ్యాపకులే రెన్యూవల్కు అర్హులని తెలిపారు. నోటిఫైడ్ కళాశాలలైన గుంటూరు, వినుకొండ, చీరాల, ఒంగోలు, నెల్లూరులోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్ నిబంధనల మేరకు కాంట్రాక్టు అధ్యాపకులను కళాశాలలకు అనుసంధానం చేస్తారని పేర్కొన్నారు.
193 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
క్రోసూరు: మండలంలోని నాగవరం గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున 193 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఎం.షఫీ తెలిపిన వివరాలు...అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామానికి చెందిన పోలిశెట్టి చెంచయ్య వద్ద ఉన్న రేషన్ బియ్యంను నకరికల్లు గ్రామానికి చెందిన వెంగళరావుకు లారీలో తరలిస్తున్నారు. ముందస్తు అందిన సమాచారం మేరకు పోలీసులు నాగవరం గ్రామం వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీలో 9930 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు చెప్పారు. లారీ స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్, విక్రయదారుడు, కొనుగోలుదారులపై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం సివిల్ సప్లయీస్ డీటీ షేక్ గఫూర్కు అప్పగించారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
మాచర్ల రూరల్:
నర్సరీలో మొక్కలకు నీరు పెడుతూ ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... గ్రామానికి చెందిన తేళ్లూరి సత్యనారాయణరెడ్డి (40) లక్ష్మీ శ్రీనివాస నర్సరీలో మొక్కలకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ వేసేందుకు మోటార్ దగ్గరకు వెళ్లి ఆన్ చేశాడు. విద్యుత్ ప్రవహిస్తున్న వైర్లు తగిలి తీవ్రమైన షాక్ తగలటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య, పిల్లలున్నారు. ఈ మేరకు విజయపురిసౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యాశాఖ సైట్లో మున్సిపల్ టీచర్ల సీనియార్టీ జాబితా