
రామలింగేశ్వరపేటలో రూ.1,11,000లకు దక్కించుకున్న లడ్డూతో నిర్వాహకులు
ఉద్దండరాయునిపాలెం(తాడికొండ): గుండెకు బైపాస్ సర్జరీ చేసిన బాధితుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.8 లక్షల సహాయాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అందజేశారు. బాపట్ల టౌన్కు చెందిన పోలా చెన్నయ్య అనే బాధితుడు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సకు రూ.12 లక్షలు ఖర్చు చేశాడు. ఆర్థికంగా స్థోమత లేని బాధితుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రెండు నెలల్లోనే రూ.8 లక్షల రూపాయలు మంజూరై బాధితుడికి చెక్కు వచ్చింది. శనివారం ఈ చెక్కును బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అందజేయడంతో బాధితుడు హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఆపన్న హస్తం అందిస్తున్న సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
రూ.1.11 లక్షలు పలికిన లడ్డూ
తెనాలిఅర్బన్: శ్రీ గణేష్ భక్తబృందం ఆధ్వర్యంలో పుట్టా రాఘవయ్య రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద లడ్డూకు వేలంపాటలో రూ.1.11,000లు, చిన్న లడ్డూకు రూ.31 వేలు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. పెద్ద లడ్డూను తొట్టెంపూడి నాగరాజు, మైలా నాగరాజు, చిన్న లడ్డూను జి.నరసింహారావు దక్కించుకున్నారు. అనంతరం ఊరేగింపుగా వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు గుంటూరు గోపి, చందు శ్రీనివాసరావు, కె.బాలాజీ, గోపాలరావు, శ్రీను, చందు, ఫణీ, తదితరులు పాల్గొన్నారు.
జారిపడి రైలు ప్రయాణికుడు మృతి
తెనాలిరూరల్: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన దుగ్గిరాల రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు దుగ్గిరాల స్టేషన్ సమీపంలో పటాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సుమారు 25 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు మృతి చెంది ఉండడం గుర్తించారు. రైలు నుంచి జారి పడి ఉంటాడని, ఉత్తర భారతదేశానికి చెందిన వాడై ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుడికి చెక్కును అందజేస్తున్న ఎంపీ నందిగం సురేష్