
గుంటూరురూరల్: రెవెన్యూ విభాగంలోని సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపటం జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ముఖ్యోద్దేశమని జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష ఫేజ్–3 రీసర్వేను క్షేత్రస్థాయిలో ఆమె శనివారం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష ఫేజ్–3లో భాగంగా జిల్లాలో 25 గ్రామాలకు సంబంధించి 30,995 రాళ్లను పంపగా ఇప్పటివరకు 25,380 రాళ్లను సర్వే చేసి పాతించినట్లు తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు ఇప్పటివరకు 13,132 పట్టాలు అందగా అందులో 8686 భూ హక్కు పత్రాలు రైతులకు అందజేశామన్నారు. 7,153 భూ హక్కు పత్రాలు ప్రింట్ రావాల్సి ఉందన్నారు. స్టోన్ ప్లాంటేషన్, భూ హక్కు పత్రాలు పంపిణీ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ముట్లూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించి జిల్లా స్థాయిలో ఇచ్చినటువంటి ఆదేశాలను క్షేత్రస్థాయిలో వారు ఏవిధంగా అమలు చేస్తున్నారో ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు. గ్రామంలోని పలువురు రైతులకు భూహక్కు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ రాజకుమారి జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష క్షేత్రస్థాయి పరిశీలన