ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల రేటు తగ్గుతున్నప్పటికీ, ఇప్పటికీ ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024లో లక్షల మంది చిన్నారులు తమ ఐదవ పుట్టినరోజు కంటే ముందుగానే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ శాతం మంది చిన్నారులు నివారించదగిన కారణాలతోనే మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
గణాంకాలు. ఐక్యరాజ్య సమితి అందించిన ఈ నివేదికలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై సమగ్రమైన సమాచారాన్ని పొందుపరిచింది. పసిపిల్లల నుంచి కౌమారదశ వరకు ఎంతమంది పిల్లలు, ఏయే దేశాల్లో మరణిస్తున్నారు అనే అంశాలు, అందుకు గల కారణాలను అందించింది.
49 లక్షలు
2024లో సుమారు 4.9 మిలియన్ల మంది (49 లక్షల మంది) పిల్లలు తమ ఐదవ పుట్టిన రోజుకు ముందే మరణించారు. వీరిలో 2.3 మిలియన్ల మంది (23 లక్షల మంది) నవజాత శిశువులు ఉన్నారు.
60%
2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు ఏళ్లలోపు పిల్లల మరణాలు సగానికి పైగా తగ్గాయి. అయితే, 2015 నుంచి ఈ మరణాల తగ్గింపు వేగం 60 శాతానికి పైగా మందగించింది.
36%
ఐదేళ్లలోపు మరణాలలో సగానికి పైగా నవజాత శిశువుల మరణాలే ఉంటున్నాయి. నెలలు నిండకుండానే పుట్టడం (36 శాతం), ప్రసవ సమయంలో తలెత్తే సమస్యలు (21 శాతం) ఇందుకు ప్రధాన కారణాలు.
3
యుద్ధాలు, అంతర్గత కల్లోలాలు ఉన్న చాద్, కాంగో, నైజర్, నైజీరియా వంటి దేశాల్లో పుట్టిన పిల్లలు సాధారణ ప్రాంతాల్లోని పిల్లల కంటే చనిపోయే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
58%
ప్రపంచవ్యాప్త మరణాల్లో 58 శాతం సబ్–సహారన్ ఆఫ్రికాలోనే సంభవిస్తున్నాయి. మరో 25 శాతం మరణాలు దక్షిణాసియా (భారత్ ఉన్న ప్రాంతం) లో నమోదవుతున్నాయి. ప్రసవ సమయంలో తలెత్తే ఇబ్బందులే ఇక్కడ ప్రధాన కారణం.
21 లక్షలు
మొత్తంగా చూసినట్లయితే 5 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 21 లక్షలమంది మరణించినట్లు అంచనా. చిన్నపిల్లల్లో అంటువ్యాధులు కారణమైతే, కౌమారదశలో 15 నుంచి 19 ఏళ్ల బాలికల్లో ఆత్మహత్యలు; బాలురలో రోడ్డు ప్రమాదాలు ప్రధాన కారణంగా ఉన్నాయి.
⇒ పిల్లల ఆరోగ్య సంరక్షణకు పెట్టాల్సిన ఖర్చు చాలా తక్కువయినప్పటికీ అది కూడా సక్రమంగా జరగడం లేదని నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్ లు, పోషకాహార లోపం లేకుండా చూడటం, ప్రసవ సమయంలో నైపుణ్యం కలిగిన ఆరోగ్య సిబ్బంది వంటివి శిశు మరణాలను తగ్గిస్తాయి. నివారించగల వ్యాధుల వల్ల ఏ బిడ్డ కూడా మరణించకూడదనే ఆశయమే.. శిశువులకు ఆయుష్షునిస్తుంది.
17%
మొదటి నెల దాటిన తర్వాత మలేరియా, విరేచనాలు, న్యుమోనియా వంటి అంటువ్యాధులు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మలేరియా అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా కొనసాగుతోంది. మలేరియా కారణంగా సుమారుగా 17 శాతం మంది మరణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువ మరణాలు సబ్–సహారన్ ఆఫ్రికాలో సంభవిస్తున్నాయి.
1,00,000
పిల్లల మరణాలకు పోషకాహార లోపమూ ఒక కారణంగా నివేదికలు చెబుతున్నాయి. ఒకటి నుంచి మూడేళ్ల వయస్సు గల పిల్లల్లో సుమారు లక్ష మందికి పైగా చిన్నారులు పోషకాహార లోపం వల్ల మరణిస్తున్నారు. పాకిస్థాన్, సోమాలియా, సూడాన్ దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.


