
ట్రెండ్ సెట్టర్
‘ఆడపిల్లలకు బైక్లు ఎందుకు!’ అని ఆ తండ్రి నిరాశపరిచి ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేది కాదు. ‘బైక్ రేసింగ్ అంటే బాయ్స్కు మాత్రమే’ అనే అలిఖిత నిబంధనను జగతిశ్రీ కుమరేశన్ బ్రేక్ చేసింది. ప్రొఫెషనల్ మోటర్ సైకిల్ రేసర్గా దూసుకుపోతోంది.
ట్రిపుల్ నేషనల్ చాంపియన్ జగత్శ్రీ కుమరేశన్ థాయ్లాండ్లో జరిగే ఎఫ్ఐఎం ఆసియా మహిళల కప్ ఆఫ్ సర్క్యూట్ రేసింగ్(ఏసీసీఆర్)లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... చెన్నైకి చెందిన జగత్శ్రీ ఒకానొక రోజు బైక్ రేసింగ్ చూసి ఆహా అనుకుంది. ఆరోజు నుంచి బైక్ రేసింగ్పై పాషన్ మొదలైంది. తండ్రికి తన మనసులోని మాట చెబితే సరే అని ప్రోత్సహించాడు. అలా శిక్షణ మొదలైంది.
పెద్ద పెద్ద బైక్లపై ప్రాక్టీస్ మొదలుపెట్టేది. 2021లో టీవీఎస్ రూకీస్ ఛాంపియన్షిప్ కోసం బాయ్స్తో పోటీ పడి సత్తా చాటింది. చదువు కారణంగా 2022లో పోటీలకు విరామం ఇచ్చింది. 2023లో ఎంఎంఎస్సీ ఎఫ్ఎంఎసీఐ ఇండియన్ నేషనల్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్షిప్లో నేషనల్ టైటిల్ గెలుచుకుంది. మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ఆర్కియాలజీ గ్రాడ్యుయేట్ అయిన జగత్శ్రీ ఎఫ్ఐఎం ఉమెన్స్ సర్క్యూట్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్(వరల్డ్ డబ్ల్యూసీఆర్) తనదైన స్థానాన్ని నిలుపుకోవాలని పట్దుదలగా ప్రయత్నిస్తోంది.