
శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన రెండవ ప్రబోధం ‘అనుగీత.’ దీనిని భగవద్గీత సారాంశంగా చెప్పవచ్చు. కురు–పాండవ యుద్ధం తర్వాత ధర్మరాజు రాజ్య పాలన చేస్తూ ఉంటాడు. కృష్ణార్జునులు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నదులు, అడవులు, కొండలలో విహరిస్తూ కబుర్లు చెప్పుకునేవారు. ఒక రోజు కృష్ణునితో అర్జునుడు ‘యుద్ధానికి పూను కున్నప్పుడు నా మనసు కలతచెంది, నేను కుంగిపోయినప్పుడు నువ్వు తత్త్వ బోధకాలైన మహా వాక్యాలను నా మీద కరుణతో బోధించి యుద్ధా నికి సిద్ధం చేశావు. అప్పుడు ఆ మాటల సారాంశాన్ని మనసులో పదిలపరుచుకోలేక పోయాను. మరోసారి ఆ తత్వోపదేశాన్ని అనుగ్రహించ’ మని ప్రార్థించాడు.
యుద్ధ ప్రారంభంలో చెప్పినదే ‘భగవద్గీత’. మానవులు పూర్తిగా లౌకిక ప్రపంచంలో మునిగి, సంసార తాపత్రయం నుండి బయటపడలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు అందులో నుంచి బయటపడి తరించటానికి భగవద్గీత 18 మెట్లు చూపిస్తుంది. ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క అధ్యాయం. ఇవి దైవా నికి దగ్గర చేస్తాయి. బ్రహ్మ విద్యను తెలిపే గీతా శ్లోకాలను యథాతథంగా పునరుక్తం చేయటం సాధ్యం కాదని తెలిపి, కృష్ణుడు వేరే పద్ధతిలో కొన్ని పాత్రల పరంగా ప్రతిపాదించాడు.
ఇందులో ‘బ్రాహ్మణ గీత’లో బ్రాహ్మణుడు, అతని భార్య సంభాషణ ద్వారా బ్రహ్మ విద్యా ప్రబోధకాలైన అంశాలను తెలిపాడు. ‘అధ్వర్య– యతి సంవాదం’లో యజ్ఞాలలో కెల్లా తపోయజ్ఞమే శ్రేష్ఠమని చెప్పాడు. గురు శిష్య సంవాద రూపంలో సత్వ గుణ సహాయంతో రజస్తమో గుణాలను జయించి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది, సత్వాన్ని కూడ విడిచిపెట్టాలని చెప్పాడు. అశ్వమేధ పర్వంలో బోధించిన ఈ ‘అనుగీత’ గీతా తాత్పర్యమే! ఇది అర్జునునిలో ఆధ్యాత్మిక పరిణామాన్ని కలిగించటానికి ఉద్దేశించినది. ఇది చదివితే, మననం చేస్తే సకల మానవాళిలో ఆధ్యాత్మిక భావ వికాసం పెంపొందుతుంది.
– డా.చెంగల్వ రామలక్ష్మి