
పంటకు ఉపయోగపడుతున్న రసాయనిక ఎరువులు 30–40% మాత్రమే!
నీరు, గాలి, భూమిని కలుషితం చేస్తున్న ‘నత్రజని కాలుష్యం’
భూతాపాన్ని పెంచడంలో, జీవవైవిధ్యాన్ని హరించటంలోనూ దీని పాత్ర ఎక్కువే
ఇంతకీ నత్రజని కాలుష్యానికి ‘నో’ చెప్పేదెలా?
‘నత్రజని కాలుష్యం’ భూగోళంపై జీవనాన్ని కష్టాలపాలు చేస్తోంది. రసాయనిక ఎరువుల వాడకం, బొగ్గు/పెట్రోలియం ఉత్పత్తుల వంటి శిలాజ ఇంధనాల వాడకం అంతకంతకూ పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. మనుషుల పనుల వల్ల అతిగా పర్యావరణంలోకి వెలువడుతున్న నత్రజని.. ప్రకృతిలోని సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తోంది. ‘నత్రజని కాలుష్యం’ ముఖ్యంగా మూడు రకాలుగా భూగోళంపై మూడు సంక్షోభాలను కలిగిస్తోంది. దీన్నే ‘ప్లానెటరీ ట్రిపుల్ క్రైసిస్’ అంటారు.
సుస్థిర పద్ధతుల్లో నత్రజని కాలుష్యాన్ని నిర్వహించే మార్గాలపై ప్రొఫెసర్ నందుల రఘురామ్ గత పాతికేళ్లుగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనీషియేటివ్ ఎమెరిటస్ చైర్మన్గా, గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ద్వారాక, ఢిల్లీ)లో ప్రొఫెసర్గా డా.రఘురామ్ సేవలందిస్తున్నారు. 2017లో ప్రపంచంలోనే మొదటిగా ‘ఇండియన్ నైట్రోజన్ అసెస్మెంట్’ నివేదిక రూపొందించటంలో ఆయనది కీలకపాత్ర. దీనిపై ఐక్యరాజ్యసమితిలో అప్పట్లోనే తీర్మానం జరిగింది కూడా. డా.రఘురామ్ని ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. రసాయనిక ఎరువుల ‘నత్రజని కాలుష్య’ తీవ్రత ఎంతో? కారణాలేమిటో? పరిష్కారాలేమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రజల ఆకలి తీర్చే క్రమంలో అధిక దిగుబడుల కోసం హరితవిప్లవంలో భాగంగా వాడటం ప్రారంభించిన రసాయనిక ఎరువులు నిజానికి పంటలకు ఉపయోగపడుతున్న దానికంటే వృథా అవుతున్నది చాలా ఎక్కువ. ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకం, వృథా ఎక్కువే. ప్రొఫెసర్ నందుల రఘురామ్ మాటల్లో చెప్పాలంటే.. ‘మన దేశంలో పొలాల్లో వేస్తున్న రసాయనిక ఎరువుల్లో 30–40% మాత్రమే పంటకు ఉపయోగపడుతున్నాయి. 60–70% వృథాగా పోతున్నాయి. నీటి కాలుష్యానికి, వాయు కాలుష్యానికి, భూతాపోన్నతికి కారణమవుతున్నాయి. జలవనరుల్లో జీవవైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నాయి’ అన్నారాయన.
ఇదీ చదవండి: పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?
6 కోట్ల టన్నుల ఎరువులు
మన దేశంలో పంటల సాగు కోసం 2023–24లో 6 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా రసాయనిక ఎరువులు వాడారు. యూరియా 357.81 లక్షల టన్నులు, డిఎపి 109.73 లక్షల టన్నులు, ఎంఓపి 16.45 లక్షల టన్నులు, ఎన్పికె మిశ్రమ ఎరువులు 116.80 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ ఎరువులపై సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మరోవైపు, ఎరువుల మోతాదు పెంచుతున్నా దిగుబడులు పెరగని స్థితి నెలకొంటున్నది. రైతులు ఏటేటా అధికంగా ఎరువులు వాడకతప్పని స్థితిని ఎదుర్కొంటున్నారు.
‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’
నత్రజని కాలుష్య ప్రభావంతో ‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’ పెచ్చరిల్లుతోంది. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం అనే మూడు పరస్పర అనుసంధాన సంక్షోభాలకు ఇది నేరుగా దోహదం చేస్తోంది.
1 వ్యవసాయంలో ఎరువుల వాడకం నత్రజని కాలుష్యానికి ప్రధాన మూలం. పంటలు వాడుకోలేకపోయిన అధిక నత్రజని నీటి వనరుల్లోకి వెళ్లి భూగర్భ జలాల్లోకి చేరుతోంది.
2పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వలన నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదలవుతున్నాయి. ఇది వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు దోహదం చేస్తోంది.
3 శుద్ధి చేయని లేదా సరిగా శుద్ధి చేయని మురుగునీటిలో అధిక స్థాయిలో నత్రజని, ఇతర పోషకాలు ఉంటాయి, ఇవి చెరువులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తాయి. ఈ కాలుష్యం వల్ల ఆక్సిజన్ లోపించి చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. ఆ నీటిలో విపరీతంగా నాచు పెరిగిపోతుంది. ఇది జలచరాలకు మరణశాసనంగా మారుతుంది.
ఏమి చేయవచ్చు?
→ నత్రజని తదితర ఎరువులను అవసరం మేరకు తగుమాత్రంగా, సముచిత పాళ్లలో ఉపయోగించాలి.
→ పశువుల పేడ మూత్రాన్ని సక్రమంగా సేకరించి, వినియోగించే పద్ధతులను అమలు చేస్తే నత్రజని కాలుష్యం తగ్గుతుంది.
→ వ్యర్థాలను తగిన రీతిలో పునర్వినియోగించటం, వనరుల వినియోగ సామర్థ్యాన్ని ప్రోత్సహించి అధిక ఎరువుల వాడకం అవసరాన్ని తగ్గించవచ్చు.
→ ప్రభుత్వాలు నత్రజని ఉద్గారాలను పరిమితం చేసే పద్ధతులను ప్రోత్సహించేలా విధానాల్లో మార్పులు తేవాలి.
→ నత్రజని కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో సమాజంలో వ్యక్తుల పాత్ర కూడా కీలకం. మాంసం వినియోగాన్ని తగ్గించటం, రసాయనాల్లేని వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, నత్రజని కాలుష్యాన్ని పరిష్కరించే విధానాల కోసం కృషి చెయ్యాలి.
ఈ పోషకాలను సమర్థంగా వాడుకోలేమా?
దేశంలో రోజుకు 15,000 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ నీటిలో 65,250 మెట్రిక్ టన్నుల నత్రజని తదితర పోషకాలు ఉంటాయి. శుద్ధి చేసి ఆ పోషకాలను పునర్వినియోగించలేక ప్రతి రోజూ 55,000 మెట్రిక్ టన్నులకు పైగా పోషకాలను కోల్పోతున్నాం. మురుగు నీటిలోని పోషకాలను పూర్తిగా రీసైకిల్ చేస్తే రసాయనిక ఎరువులు 40% వరకు ఆదా అయ్యేవని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు.
అదేవిధంగా, దేశంలో 20 కోట్ల పశువులున్నాయి. రోజుకు ఒక జంతువుకు 15 కిలోల పేడ వస్తుంది. అందులో 5% ఎన్పికె పోషకాలు ఉన్నాయి. వాటి పరిమాణం 1,50,000 మెట్రిక్ టన్నులు. ఇది మనం వాడే మొత్తం రసాయనిక ఎరువుల్లో 95 శాతం. దీనికి అదనంగా, రోజుకు ఒక పశువు 15–20 లీటర్ల మూత్రం పోస్తుంది. వీటిలో 3% పోషకాలు ఉంటాయి. ఆ మొత్తం 1,20,000 మెట్రిక్ టన్నులు. సక్రమంగా మూత్రాన్ని సేకరించి వాడుకోలేక చాలా కోల్పోతున్నాం. మరో మాటలో చెప్పాలంటే.. పంట పొలాలు, జనావాసాల నుంచి వెలువడే మురుగునీటిలో 3,35,000 టన్నులకు పైగా పునర్వినియోగించదగిన పోషకాలు ఉన్నాయి. ఇది మన దేశంలో రోజువారీగా వాడుతున్న ఎరువులకు రెట్టింపు ఉంటాయని డా.రఘురామ్ వివరించారు.
ఎరువు 4 రోజుల్లో మాయం!
పంటలకు స్థూల పోషకాలైన నత్రజని (యూరియా), ఫాస్ఫరస్, పొటాషియం/సల్ఫర్లను 4:2:1 నిష్పత్తిలో వాడాలి. ఉదా.. వరి పంటకు సీజన్కు హెక్టారుకు అన్నీ కలిపి 120 కిలోల ఎరువు వెయ్యాలని శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. అయితే, రైతులు ఈ నిష్పత్తిపై సరైన అవగాహన లేక ఈ మోతాదులను పట్టించుకోవటం లేదు. పంట పచ్చబడితే చాలన్నట్లు యూరియానే పొలాల్లో కుమ్మరిస్తున్నారని, అది కూడా పంట సీజన్లో కేవలం రెండు సార్లు మాత్రమే ఎరువులు వేస్తున్నారని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు. రసాయనిక ఎరువులను పంట 2–4 రోజుల్లోనే తీసుకోగలుగుతుంది.
పంట తీసుకునేది 30–40% మాత్రమే. మిగతా 60–70% ఎరువు నీటి ద్వారా, గాలి ద్వారా వృథాగా పోతున్నది. సమర్థవంతంగా ఎరువు వినియోగించకపోవటం వల్ల సుమారు రూ. లక్ష కోట్ల ఎరువుల సబ్సిడీ వృథా అవుతోందని ప్రొ. రఘురామ్ అన్నారు. ఏ ఎరువు ఎంత పాళ్లలో వేయాలో అంతే వెయ్యాలి. తక్కువ మోతాదులో, ఎక్కువ సార్లు వేస్తే ఎక్కువగా పంటకు ఉపయోగం. వృథా తగ్గుతుంది. అప్పుడే నత్రజని కాలుష్యమూ తగ్గుతుంది అన్నారాయన. అయితే, ఎక్కువ సార్లు వేయటానికి రైతులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. మంచి గిట్టుబాటు ధర దక్కినప్పుడే రైతులు ఆపని చేయగలుగుతా రన్నారు.