ఇది అశ్వమేలు యాగం! | Gauri Maulekhi champions animal welfare on pilgrimage routes | Sakshi
Sakshi News home page

ఇది అశ్వమేలు యాగం!

Mar 15 2026 1:03 AM | Updated on Mar 15 2026 1:03 AM

Gauri Maulekhi champions animal welfare on pilgrimage routes

మెరుపు వేగంతో పరుగెత్తే గుర్రాలను చూసి ‘ఆహా’ అనుకుంటాం. చాలామంది గుర్రపు డెక్కల వేగాన్ని మాత్రమే చూస్తారు. కొద్దిమంది మాత్రం వాటి కళ్లలోకి చూస్తారు. ఆ కళ్లలోని అలసటను, అనారోగ్యాన్ని గ్రహిస్తారు. ఉత్తరాఖండ్‌కు చెందిన గౌరీ మౌలేఖీ అలాంటి వారిలో ఒకరు. తీర్థయాత్రల దారుల్లో గుర్రాలు పడే బాధలు, హింసను కళ్లారా చూసింది. గుర్రాల సంక్షేమం కోసం నడుం బిగించింది. వేలాది గుర్రాలను రక్షించింది. వాటి కోసం సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గుర్రాలపై హింస జరగకుండా స్వచ్ఛంద సేవకులతో సైన్యాన్ని ఏర్పాటు చేసింది. ఆమెది రాజ్యవిస్తరణ కోసం చేసే అశ్వమేధ యాగం కాదు... అశ్వాల సంక్షేమం కోసం చేసే అశ్వమేలు ఉద్యమ యాగం...

ఎర్రటి ఎండలో రెండు గుర్రాలు ఒక బండిని లాగుతూ అలసటతో డెహ్రాడూన్‌ సమీపంలో కుప్పకూలిపోయాయి. ‘అయ్యో!’ అనుకోలేదు యజమాని. అతడికి ఆగ్రహం వచ్చింది. భయపెట్టి పరుగెత్తించడానికి వాటి ముక్కుల దగ్గర కాగితం వెలిగించాడు. అవి భయాందోళనలతో మళ్లీ పరుగెత్తడం ప్రారంభించాయి. ఈ  సంఘటన గౌరి మౌలేఖీకి పదే పదే గుర్తుకు వచ్చి బాధ పెట్టేది. చార్‌ధామ్, వైష్ణోదేవి వంటి ప్రసిద్ధి తీర్థయాత్ర మార్గాలలో గుర్రాలను ఉపయోగిస్తారు. అక్కడ కొన్ని గుర్రాలు ఎదుర్కొనే బాధలు ఇన్నీ కావు. ఈ అమానవీయ దృశ్యాన్ని మార్చాలనుకుంది  గౌరి.

న్యాయస్థానం దృష్టికి...
వివిధ రూపాల్లో గుర్రాలు ఎదుర్కొంటున్న హింసను ఉత్తరాఖండ్‌ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది గౌరి. గుర్రాలను మాతృప్రేమతో ఎలా చూసుకోవాలో చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. గాయపడి ఎవరూ పట్టించుకోని గుర్రాలకు ఆశ్రయం కల్పించడానికి ఉత్తరాఖండ్‌లో గుర్రాల అభయారణ్యం ఏర్పాటు చేసింది. ఆమె పని కేవలం గుర్రాలకు పునరావాసం కల్పించడం మాత్రమే కాదు, ఎక్కడ గుర్రాలపై హింస జరిగినా నిరోధించడం, జంతువుల పట్ల కరుణతో ఉండాలనే సందేశాన్ని జనాలలోకి తీసుకువెళ్లడం. జంతు సంక్షేమ ఉద్యమానికి ముందు విద్యాబోధన, రేడియో జాకీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, థియేటర్‌... ఇలా ఎన్నో పనులు చేసింది గౌరి మౌలేఖీ.

క్షేత్రస్థాయిలో...
‘మా జోక్యానికి ముందు రాష్ట్రంలో జంతువుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఏవో ఆచారాల పేర్లతో లక్షలాది జంతువులను బలి ఇచ్చేవారు. పశువైద్యుల కొరత ఉండేది. ప్రభుత్వ సహకారంతో వన్య్రపాణుల సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగుపరచడానికి సహకార విధానంతో అధికారులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాం, జంతువులకు సంబంధించి ఆరోగ్యకరమైన పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను  ఏర్పాటు చేశాం. తీర్థయాత్ర మార్గాలలో రిజిస్టర్డ్, ఆరోగ్యకరమైన గుర్రాలను మాత్రమే అనుమతించేలా చూశాం’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది గౌరి.

అడ్డంకులు ఎదురైనా సరే...
గత కొన్ని సంవత్సరాలుగా డెహ్రాడూన్‌ చీఫ్‌ వెటర్నిటీ ఆఫీసర్‌ డా.సతీష్‌ జోషి, గౌరీతో కలిసి జంతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ‘సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కేదార్‌నాథ్, యమునోత్రిలాంటి ప్రాంతాలలో మా వైద్య అధికారులతో పాటు గౌరి బృందం చెప్పుకోదగినరీతిలో జంతుసంక్షేమం కోసం కృషి చేస్తోంది’ అంటున్నాడు డాక్టర్‌ సతీష్‌. ఒకప్పుడు ఏ గుర్రాలను చూసి అయితే గౌరి బాధపడిందో అవి ఇప్పుడు ఆమె సంరక్షణలో క్షేమంగా... ఆరోగ్యంగా ఉన్నాయి. ‘ఇప్పుడు అవి నా దగ్గర క్షేమంగా, సంతోషంగా ఉన్నాయి. చనిపోయే వరకు జంతువులతో పనిచేయించాలనే క్రూరత్వం అంతరించాలి’ అంటుంది గౌరి.

జంతు సంక్షేమం... అషిమ ఫెలోషిప్‌
జంతు సంక్షేమానికి సంబంధించి యువతరానికి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటైన కార్యక్రమం... అషిమ ఫెలోషిప్‌.  చట్టపరమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలతో వ్యూహాత్మక కమ్యూనికేషన్‌లకు ఉపయోగపడుతుంది. ఈ ఫెలోషిన్‌ అన్‌లైన్‌ సెషన్‌తో ప్రారంభమవుతుంది.

‘జంతు సంక్షేమ చట్టాల గురించి సమగ్ర జ్ఞానాన్ని అందించే ఫెలోషిప్‌ ఇది’ అంటుంది సనా సింగ్‌. దిల్లీకి చెందిన సనా సింగ్‌కు చాలాసంవత్సరాలుగా జంతుసంక్షేమం ఆసక్తి. ఆ  ఆసక్తితోనే అషిమ ఫెలోషిప్‌ చేసింది సింగ్‌. ‘ఫెలోషిప్‌ కోసం ఇచ్చే ఎనిమిది నెలల శిక్షణ ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ ఇది మాత్రమే సరిపోదు. జంతు సంక్షేమానికి సంబంధించి సమాజం సీరియస్‌గా ఆలోచించాలి’ అంటుంది.    – గౌరి మౌలేఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement