సాధారణంగా పున్నమి అనగానే వెన్నెల గుర్తుకొస్తుంది. సంవత్సరంలో పన్నెండు పున్నములు వస్తాయి. ప్రతి పున్నమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. పున్నమి నాడు మనఃకారకుడైన చంద్రుని పూజించడం మంచిదని పెద్దలు చెబుతారు. నేడు చైత్ర పౌర్ణమి. ఈ రోజున హనుమంతుడిని, సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రంపూట చంద్రుడిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. ఆ రోజున లలిత సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ స్వామి పూజతో సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున ఉపవాసం చేసేవారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది.
చైత్ర పౌర్ణమి నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతునికి, నారాయణ స్వామికి నేతి దీపం వెలిగించడం విశిష్ట ఫలితాలను ప్రసాదిస్తుంది.
అక్కమహాదేవి జయంతి నేడు
12వ శతాబ్దపు ప్రసిద్ధ కన్నడ కవయిత్రి అక్కమహాదేవి జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీశైలంలో ఆమె తపస్సు చేసినట్లుగా భావించేప్రాంతం, మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
పరమశివుని భర్తగా భావించి,వచన సాహిత్యానికి ఆమె చేసిన కృషి అద్వితీయం.
12వ శతాబ్దపు వీరశైవ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొలి మహిళా కవయిత్రి.
కర్ణాటకకు చెందిన ఆమె శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని ఆరాధించి, తపస్సు చేసిందామె.
అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని, శ్రీశైల దేవస్థానంతో పాటు కర్ణాటకలోని అనేక ప్రదేశాలలో, మహిళా విశ్వవిద్యాలయాలలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
నేడు (ఏప్రిల్ 2, గురువారం) చైత్రపూర్ణిమ
– డి.వి.ఆర్


