కొండంత ప్రేమ.. సముద్రమంత సాహసం... | Andhra photographer Rukhiya Mohammed on her award-winning photographs of Eastern Ghats | Sakshi
Sakshi News home page

కొండంత ప్రేమ.. సముద్రమంత సాహసం...

May 27 2026 12:08 AM | Updated on May 27 2026 12:08 AM

Andhra photographer Rukhiya Mohammed on her award-winning photographs of Eastern Ghats

మండే వేసవిలో హిల్‌ స్టేషన్స్‌లో చల్లదనాన్ని ఆనందించాలని, సముద్ర తీరాల్లో సేద తీరాలని, నలువైపులా పరుచుకున్నప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని కోరుకోని వారు అరుదే. మరి కాంక్రీట్‌ జంగిల్స్‌ నుంచి మనల్ని కాపాడుతున్న ఆ అద్భుతాలను కాపాడే ప్రయత్నం మనలో ఎంత మంది చేస్తున్నాం? ఇలా ప్రశ్నిస్తూనే తన కెమెరా ద్వారా సమాధానం చెబుతున్నారు హైదరాబాద్‌ వాసి రుఖియా మహ్మద్‌. ఆమెను తాజాగా ప్రతిష్టాత్మక నేచర్‌ ఇన్ ఫోకస్‌ పురస్కారం వరించింది. తన అన్వేషణకు అంతర్జాతీయ గుర్తింపును అందుకున్న రుఖియా మహ్మద్‌ గురించి...

జన్మతః కాకినాడలో పుట్టి పెరిగిన తనకు బాల్యం నుంచే సముద్రాలు, కొండలు చిరపరిచితమని, అభివృద్ధి పేరుతో ఆ ప్రకృతి అందాలకు ఇతర జీవకోటికి తీరని కష్టనష్టాలను తెచ్చిపెడుతున్నామని రుఖియా మహ్మద్‌ ఆవేదన వ్యక్తం చేస్తారు. వేల మాటలతో కన్నా ఒక్క ఫొటోతో ఈ నిజాన్ని మరింత గట్టిగా చెప్పగలమని అంటున్న ఆమె తన కెమెరాతో ప్రకృతి కష్టాలను కళ్లకు కడుతున్నారు. తాజాగా తాను రూపొందించిన తన ‘ఎకోస్‌ ఫ్రమ్‌ ది ఈస్టర్న్‌ ఘాట్స్‌’ అనే ఫోటో స్టోరీ ద్వారా ప్రతిష్టాత్మక నేచర్‌ ఇన్ ఫోకస్‌ అవార్డ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.

అభిరుచి తీరా...నాన్న ఇచ్చిన కెమెరా...
మాది ఆంధ్రప్రదేశ్‌లోని  కాకినాడ. అక్కడ సముద్ర తీర ప్రాంతాలు, సమీపంలోని మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లోని పర్వత శ్రేణులు నాకు చిన్ననాటి అత్యంత ప్రియమైన నేస్తాలు. చిన్న వయసులోనే నాన్న కొనిచ్చిన కెమెరాతో ఆ ప్రకృతి అందాలన్నింటినీ నిక్షిప్తం చేసుకునేదాన్ని. చదువు, కెరీర్‌ ల వేటలో ఆ అభిరుచి అటకెక్కింది. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ప్రస్తుతం చిన్నతనంలో నేను తిరిగిన కొండ ప్రాంతాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. ఆ బాధ నుంచే మరోసారి కెమెరా అందుకున్నాను. డ్రోన్‌ వినియోగంలో శిక్షణ పొందడం సహా  పూర్తి సన్నద్ధతతో ఫొటోగ్రాఫర్‌గా మారాను.

తూర్పు కనుమల మార్పులకు అద్దం పడుతూ...
చిన్ననాటి నుంచి తూర్పు కనుమల పట్ల ఉన్న ఆసక్తి, ఆందోళన, ప్రేమ నుంచి నేచర్‌ ఇన్ ఫోకస్‌కు నేను పంపిన నా కొత్త ్రపాజెక్ట్‌ పుట్టింది. ఇక్కడి ప్రకృతికి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో జనం చూడాలని కోరుకున్నాను, అడవుల నరికివేత, మైనింగ్, పర్యాటక ్రపాజెక్టుల నుంచి వేగవంతమైన పట్టణీకరణల నేపథ్యంలో తూర్పు కనుమలలో క్రమంగా వస్తున్న మార్పులను నా కెమెరా బంధించింది. డ్రోన్ తో గగనతలం నుంచి తీసిన ఈ చిత్రాల ద్వారా రోడ్ల వల్ల తెగి΄ోయిన అడవులను, నిర్మాణాల కోసం చదును చేసిన కొండలను, విస్తరిస్తున్న నగరాల ధాటికి కనుమరుగవుతున్న పచ్చదనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించగలిగాను.

సముద్రంతో స్నేహం కోసం ...
తీర్రపాంతంలో పెరగడం వల్ల సముద్రంతో చిన్నారి స్నేహం చేశా. కొండంత ప్రేమతో ్రపారంభమైన నా ప్రయాణాలు సముద్రమంత సాహసాలు చేయించాయి. అండమాన్‌లో డైవింగ్‌లో పొందిన శిక్షణ అనంత జలరాశుల్లో తల మునకలే యిస్తూ సర్టిఫైడ్‌ స్కూబా డైవర్‌గా మార్చింది.  ప్రస్తుతం డీప్‌ డైవింగ్‌ సర్టిఫికెట్‌ అందుకుని అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్నాను. మాల్దీవులు, మారిషస్, ఈజిప్ట్, కాలిఫోర్నియా, సింగపూర్‌... లలో ఉన్న సముద్రాల్లో డైవింగ్‌ చేశాను. సముద్రాలంటే కేవలం మనం ఎంజాయ్‌ చేసే బీచ్‌లు కాదు అవి కోట్లాది జీవరాశుల నిలయాలు. ప్రకృతి సంపదకు ఆలయాలు.

వీటిని  పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రయాణిస్తూ స్కూబా డైవింగ్‌ను ఓ మార్గంగా మార్చుకున్నాను. ప్రస్తుతం గూగుల్‌లో ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే భవిష్యత్తులో నా అభిరుచులను ఆశయాలను మేళవిస్తూ ప్రయాణించాలని ఆశిస్తున్నాను’’ అంటూ ముగించారు రుఖియా మహ్మద్‌. సంప్రదాయ కుటుంబంలో పుట్టినా అన్నింటా ఆమెకు అండగా నిలిచిన ఆమె తండ్రి ప్రస్తుతం ఆమెతో లేరు కానీ ఆయన కొనిచ్చిన కెమెరా ఉంది. సమాజానికి ఆమె సందేశం చేరవేస్తోంది. ఈ పర్యావరణ హితురాలి ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని కోరుకుందాం.

– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌ 

Advertisement
 
Advertisement
Advertisement