దెందులూరు: దెందులూరు మండలం గాలాయగూడెం శివారు నాగులదేవునిపాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొత్తపల్లి రఘురాం (20) మృతదేహం పెదవేగి మండలం అంకన్నగూడెం సమీపంలోని పోలవరం కుడి కాలువ లాకుల వద్ద మంగళవారం లభ్యమైంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో చిన్నపాటి గొడవ జరగడంతో రఘురాం ఈ నెల 11న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలిస్తుండగా, కాలువ గట్టుపై అతని మోటార్సైకిల్, చొక్కా, బీటెక్ ఫైనల్ ఇయర్ హాల్టికెట్ లభించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించి, కాలువలో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన భూమిలో అదే గ్రామానికి చెందిన సోమరాజు సిమెంట్ స్తంభాలతో ఫెన్సింగ్ వేస్తుండగా పంచాయతీ అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పంచాయతీ అభివృద్ధి అధికారి నాగదేవి ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే, గ్రామంలోని ఇతర ఆక్రమణలను తొలగిస్తేనే తాను ఫెన్సింగ్ తొలగిస్తానని సోమరాజు బదులిచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వీడీవో నాగదేవి వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.


