కామవరపుకోట: అన్నదమ్ముల అనుబంధం విడదీయరానిది. కలిసిమెలిసి జీవితం పంచుకున్న ఆ అన్నదమ్ములు మృతిలోనూ ఒక్కటయ్యారు. మండలంలోని పాతూరులో మంగళవారం కొద్ది గంటల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాతూరు రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నదమ్ములు పాకలపాటి వెంకయ్య (81), పాకలపాటి సుబ్బారావు (77) మంగళవారం కన్నుమూశారు. ఉదయం తమ్ముడు సుబ్బారావు అనారోగ్యంతో మృతిచెందగా, సాయంత్రం అన్న వెంకయ్య వయోభారంతో ప్రాణాలు విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవసాయ రంగంలో కలిసిమెలిసి పనిచేయడంతో పాటు గ్రామస్తులతో ఎంతో ఆప్యాయంగా మెలిగి, తలలో నాలుకలా ఉన్నారని గ్రామస్తులు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. వెంకయ్య కుమారుడు పాకలపాటి ప్రసాద్, సుబ్బారావు కుమారుడు పాకలపాటి దుర్గారావు (పీడీఆర్) ఇద్దరూ కామవరపుకోట మండల ప్రజలకు కూరగాయల వ్యాపారస్తులుగా సుపరిచితులు. ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసి పలువురు రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.


