ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలోని ఇంజనీర్లకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం స్థానిక ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో ఇరిగేషన్ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో హేలాపురి విజన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కానూరి నాగభూషణం తదితరుల ఆధ్వర్యంలో 20 మంది ఇంజనీర్లు, ఎన్జీవో నాయకులను సన్మానించారు. అనంతరం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవర రాజశేఖర రావు రచించి పాడిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఈఎన్సీ ఆర్. సతీష్ కుమార్, డిప్యూటీ ఎస్ఈలు కె. రాజు, పీ. ధనుంజయ్, క్వాలిటీ డీఈఈ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడి: మండల పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైంది. బాధితుల ఫిర్యాదుల మేరకు విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయ జనరల్ మేనేజర్ జానకిరాణి నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం స్థానిక ఏడీఈ కార్యాలయంలో విచారణ చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై పలువురు బాధిత రైతుల నుంచి లిఖితపూర్వక వాంగ్మూలాలు, ఆధారాలను సేకరించారు. విచారణ నివేదికను నేరుగా సీఎండీ కార్యాలయానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
టి.నరసాపురం: పరిపాలనా శిక్షణలో భాగంగా టి.నరసాపురం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టి.నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ టి.సాయిబాబా, రెవెన్యూ సిబ్బంది ఆయనకు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. రెవెన్యూ పరిపాలన, తహశీల్దార్ల విధులపై ప్రత్యక్ష అవగాహన కోసం కొద్దిరోజుల పాటు ఇక్కడ శిక్షణ పొందనున్నట్లు ట్రైనీ కలెక్టర్ తెలిపారు. అనంతరం మండలంలో జరుగుతున్న రీ–సర్వే పురోగతి, ఇతర రెవెన్యూ అంశాలపై స్థానిక అధికారులతో సమీక్షించారు.
నరసాపురం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్గా నరసాపురం వార్డు సచివాలయ ఉద్యోగి జి.కిరణ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి.జోసఫ్ కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కిరణ్కుమార్, సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. నూతన కన్వీనర్గా ఎన్నికై న ఆయనను నరసాపురం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అభినందించారు.
భీమవరం: జిల్లాలోని పాఠశాల యాజమాన్య కమిటీల కాలపరిమితి ముగియడంతో నూతన కమిటీల ఎన్నికను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఒ.అనిల్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు.


